
సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించాలంటూ..
● సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో (పెద్దాస్పత్రి) సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు సక్రమంగా అందించాలని కోరుతూ సీపీఎం రూరల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆ పార్టీ కార్యకర్తలు ఆస్పత్రి ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్, సీపీఎం సీనియర్ నాయకుడు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా పెద్దాస్పత్రికి ప్రభుత్వం న్యూరో, గుండె, కేన్సర్, యూరాలజీ లాంటి పలు సూపర్ స్పెషాలిటీ విభాగాలను మంజూరు చేయడమే కాకుండా డాక్టర్లను నియమించిందన్నారు. అయితే ఆయా విభాగాల్లో డాక్టర్లు సక్రమంగా ఉండటం లేదని ఆరోపించారు. పూర్తిస్థాయిలో డాక్టర్లు అందుబాటులో ఉంటూ పూర్తిస్థాయిలో వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే శుద్ధి చేసిన నీటిని రోగులకు అందించాలని కోరారు. డయాలసిస్ రోగులకు ఆస్పత్రిలోనే మందులు ఉచితంగా అందించాలన్నారు. కొన్ని రకాల మందులను బయటకు డాక్టర్లు రాసివ్వడం సరికాదన్నారు. పరిశుభ్రతను మెరుగుపరచాలని కోరారు. వీటిపై తక్షణమే అధికారులు స్పందించి మెరుగైన వసతులు, సేవలు రోగులకు అందించాలని లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కొండా ప్రసాద్, నాయకులు అరిగెల రమమ్మ, షాహీనా బేగం, అజీజ్, సుధాకర్, షమీం, పెంచల నరసయ్య, ఒంగోలు సుధీర్ తదితరులు పాల్గొన్నారు.