
ఫీల్డ్ అసిస్టెంట్ నియామకంపై అభ్యంతరం
కొండాపురం: మండలంలోని మర్రిగుంటలో ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ నియామకంపై సర్పంచ్ దార్ల గోపీ, ఉపసర్పంచ్ జెజవాడ విఘ్నేష్, మరికొందరు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం ఎంపీడీఓ ఎస్.ఆదినారాయణను కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపీ మాట్లాడుతూ గ్రామంలో 220 జాబ్కార్డులున్నాయని తెలిపారు. చిన్న గ్రామమైన మర్రిగుంటలో ఫీల్ట్ అసిస్టెంట్గా అంకబాబు అనే వ్యక్తి 17 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడని చెప్పారు. ఇప్పటి వరకు అవకతవకలు జరగలేదన్నారు. సోషల్ ఆడిట్లో కూడా రికవరీ లేదన్నారు. అయితే అధికార పార్టీ నాయకుల మాటలు విని గ్రామానికి చెందిన మరో వ్యక్తికి రెండో లాగిన్ ఇచ్చి పనులు చేయిస్తున్నారని వాపోయారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫీల్ట్ అసిస్టెంట్ను తొలగించాలని కోరారు. రెండో వ్యక్తికి లాగిన్ ఇవ్వడంపై ప్రభుత్వ జీఓ ఉంటే ఇవ్వాల్సిందిగా ఎంపీడీఓను అడిగారు. తనకు లాగిన్ ఇచ్చే అధికారం ఉందని, జీఓ కావాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకోవాలని ఆయన అన్నారు. మొదటి వ్యక్తి సరిగా విధులు నిర్వర్తించకపోవడంతోనే రెండో వ్యక్తికి లాగిన్ ఇచ్చి పనిచేయిస్తున్నట్లు సమాధానమిచ్చారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చని ఎంపీడీఓ అన్నారు.