
పెంచలకోనలో శాస్త్రోక్తంగా జ్యేష్టాభిషేకం
రాపూరు: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీరసింహస్వామి దేవస్థానంలో బుధవారం జ్యేష్టాభిషేక వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జ్యేష్ట మాసంలో జ్యేష్ట నక్షత్రం, పౌర్ణమి, ఒకేరోజు వచ్చిన సందర్భంగా వైష్ణవ దేవస్థానాల్లో హోమం, అభిషేకాలు, నిర్వహించడం ఆచారమని ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, పెంచలయ్యస్వామి వెల్లడించారు. 5 గంటలకు సుప్రభాతం, అభిషేకం, పూలంగిసేవ, నరసింహ హోమం నిర్వహించారు. 10 గంటలకు శ్రీవారి నిత్య కల్యాణ మండపంలో స్నపనపీఠంపై నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మీదేవిల ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చారు. వాటి ముందు 81 కలశాలను ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ కలశాల్లోని జలాలతో స్వామి, అమ్మవార్లకు వేదపండితులు స్నపన తిరుమంజనం జరిపారు. రాత్రి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను తిరుచ్చిపై కొలువుదీర్చి కోన మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు.