
కప్పరాళ్లతిప్పలో పోలీసుల తనిఖీలు
బిట్రగుంట: బోగోలు మండలం కప్పరాళ్లతిప్పలో పోలీసులు మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ పి.శ్రీధర్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, 72 మంది సిబ్బందితో కప్పరాళ్లతిప్ప, అల్లిమడుగు సంఘం ప్రాంతాల్లోని సుమారు 400 ఇళ్లలో తనిఖీలు చేశారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్షీట్ ఉన్న వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించి పాత నేరస్తులు, అనుమానితుల కద లికలు, బయటి వ్యక్తుల రాకపోకలపై ఆరా తీశారు. సరైన పత్రాల్లేని 33 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. పాత నేరస్తులు, ఇతర రాష్ట్రాల్లో క్రియాశీలకంగా ఉండి నేరాలకు పాల్పడుతున్న స్థానికుల వివరాలు, నాటుసారా తయారీదారుల గురించి ఆరా తీశారు. నేరాల నియంత్రణలో భాగంగా నిఘా ముమ్మరం చేశామని, ఎటువంటి పొరపాట్లు చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే తర్వాత సామాజికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని, నేరాలకు దూరంగా ఉండి శాంతియుత జీవనం గడపాలని సూచించారు. తనిఖీల్లో సీఐలు బి.పాపారావు, జి.రాజేశ్వరరావు, ఎండీ ఫిరోజ్, ఎస్సైలు భోజ్యా, కిశోర్బాబు, జంపాని కుమార్, బాజీ బాబు, గౌస్బాషా, వెంకటేశ్వర్లు, లతీఫ్ ఉన్నీసా, సిబ్బంది పాల్గొన్నారు.