
టీచర్లకు తప్పని ఇక్కట్లు
నెల్లూరు(టౌన్): టీచర్లకు బదిలీ ఇక్కట్లు తప్పడం లేదు. హెడ్మాస్టర్ల నుంచి ఎస్జీటీల వరకు ఇబ్బందులు పడిన పరిస్థితి. హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లకు ఆన్లైన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్జీటీలకు మాన్యువల్ పద్ధతిలో కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం నెల్లూరు దర్గామిట్టలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఎస్జీటీలకు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. తొలిరోజు 250 మంది హాజరుకావాలని మెసేజ్లు పంపించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తామని చెప్పిన జిల్లా విద్యాశాఖాధికారులు రాత్రి 8 గంటలకు ప్రక్రియను చేపట్టారు. సీనియారిటీ లిస్ట్ను పలుసార్లు మార్పులు చేపట్టి ఫైనల్ లిస్ట్ను ప్రకటించడంతో కౌన్సెలింగ్ను ప్రారంభించారు. ఇది పూర్తయ్యే సరికి అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే మధ్యాహ్నం కౌన్సెలింగ్కు వచ్చిన ఉపాధ్యాయులు ఇక్కట్లు పడ్డారు. అనేకమంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు. కూర్చొనేందుకు కనీసం కుర్చీలు కూడా లేని పరిస్థితి. బయట చెట్ల కింద, వరండాలో ఉపాధ్యాయులు పడిగాపులు కాశారు. సీనియారిటీ జాబితాపై సరైన అవగాహన లేకపోవడంతో కౌన్సెలింగ్ ఆలస్యమవుతున్నట్లు టీచర్లు మండిపడుతున్నారు. బుధవారం నుంచైనా ఉదయాన్నే ప్రక్రియ ప్రారంభించి సాయంత్రానికల్లా పూర్తి చేయాలని కోరుతున్నారు.
ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్
తొలిరోజు 250 మందికి..
మధ్యాహ్నం 3 గంటలకు రావాలని ఆదేశాలు
రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ