
చైన్నెకి గంజాయి తరలిస్తుండగా..
● వ్యక్తి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఒడిశా నుంచి చైన్నెకి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని తిరుపతి జిల్లా గూడూరు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నెల్లూరు డీఎస్పీ జి.మురళీధర్ తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ఒడిశా, విశాఖపట్నం నుంచి వచ్చే రైళ్లలో మత్తు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా కట్టడికి రైల్వే పోలీస్లు ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో తనిఖీలు ముమ్మరం చేశారు. నెల్లూరు రైల్వే సీఐ ఎ.సుధాకర్ ఆధ్వర్యంలో సోమవారం కావలి, నెల్లూరు, గూడూరు రైల్వేస్టేషన్లు, ప్లాట్ఫారంలపై తనిఖీలు నిర్వహించారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన దేవదాస్ టాటా నగర్ – ఎర్నాకుళం రైల్లో ప్రయాణిస్తూ గూడూరు రైల్వేస్టేషన్లో దిగి హడావుడి బయటకు వెళ్తుండగా ఇన్చార్జి రైల్వే ఎస్సై వై.చెన్నకేశవరావు అదుపులోకి తీసుకున్నారు. దాస్ బ్యాగ్లో మూడు కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా ఒడిశాలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి చైన్నె పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయించేందుకు వెళ్తున్నట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశామని డీఎస్పీ చెప్పారు. సమావేశంలో ఇన్చార్జి ఎస్సై జి.మాలకొండయ్య, ఆర్పీఎఫ్ ఏఎస్సై సీకేఎన్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.