
ఏడాదిగా నానా ఇబ్బందులు పెట్టారు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో కొన్ని పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు కూటమి నేతల రెడ్బుక్ రాజ్యాంగానికి గులాంగిరి చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండ ఉందనే ధీమాతో స్టేషన్లోనే సెటిల్మెంట్లు, దందాలు నిర్వహిస్తూ కలెక్షన్ కింగ్లుగా వ్యవహరిస్తున్నారు. ఇసుక, గ్రావెల్, చివరకు చికెన్ వేస్ట్ మాఫియా వరకు కొందరు పోలీసులే నిర్వహిస్తున్నారంటే వారి చీకటి దందా ఏ స్థాయికి చేరిందో ఇట్టే అర్థమవుతోంది. ఉన్నతాధికారులు రాజకీయ ప్రేరేపిత కేసులు నమోదు చేయొద్దని పదేపదే హెచ్చరిస్తున్నా.. కింది స్థాయి అధికారులు వారి ఆదేశాలను పెడ చెవిన పెడుతున్నారు. సెటిల్మెంట్ దందాలు, అక్రమ కేసులపైనే దృష్టి సారించి జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం రాకతోనే వైఎఎస్సార్సీపీ నేతలపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది. టీడీపీ అక్రమాలకు అండగా బాధితులపై కిరాయి రౌడీల్లా దౌర్జన్యాలు, పంచాయితీలు పెడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు రోజునే అనంతసాగరం మండలం శంకరనగరంలో టీడీపీ నేతల దమనకాండ మొదలైంది. వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడడంతోపాటు రైతులపై రౌడీషీట్లు తెరిపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి గొంతులను నొక్కేస్తున్నారు. మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై ఇప్పటికే పది అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. కావలిలోనూ అదే రెడ్బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్ అయిన నన్ను స్థానిక టీడీపీ నేతలు నానా ఇబ్బందులు పెట్టారు. ప్రతి విషయంలో, ప్రతి కేసులో నా పేరు నమోదు చేసి నాపై ఎఫ్ఐఆర్లు చేయించారు. ఇటీవల నా కుటుంబ సభ్యులపైనా కేసులు నమోదు చేయించారు. నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఎస్సీ కులానికి చెందిన నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ గ్రామంలో లేకుండా తరిమేయాలని చూస్తున్నారు. – దార్ల గోపి, మర్రిగుంట సర్పంచ్