
ఏదో చేశారంతే..
● మొక్కుబడిగా
షైనింగ్ స్టార్ అవార్డుల ప్రదానోత్సవం
● మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల
డుమ్మా
● 284 మంది పది, ఇంటర్ విద్యార్థులకు అవార్డులు
● తల్లిదండ్రులకు సన్మాన విషయం
మరిచిన అధికారులు
నెల్లూరు(టౌన్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం జిల్లాలో మొక్కుబడిగా సాగింది. దీనికి మంత్రులతోపాటు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. పదో తరగతి, ఇంటర్మీడియట్కు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదుతోపాటు మెడల్, సర్టిఫికెట్ను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి జిల్లాకు చెందిన మంత్రులు, ఇన్చార్జి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం పంపారు. అయితే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాత్రమే హాజరయ్యారు. ఇంకా నగర మేయర్ స్రవంతి వచ్చారు. కలెక్టర్ ఆనంద్ సెలవుపై వెళ్లడంతో ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలు డుమ్మా కొట్టారు. నియోజకవర్గ పరిధిలో కార్యక్రమం జరుగుతున్నా శ్రీధర్రెడ్డి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా ప్రతిభ చూపిన విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొంతమందిని ఎంపిక చేసి కేవలం వారితో మాట్లాడించడానికి పరిమితమయ్యారు. జిల్లాలో 284 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో పదో తరగతికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల నుంచి 95 మంది, ప్రైవేట్ పాఠశాలల నుంచి 155 మంది, ఇంటర్కు సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి ఆరుగురు, ప్రైవేట్ జూనియర్ కళాశాలల నుంచి 28 మందికి రూ.20 వేల చొప్పున నగదు, మెడల్, సర్టిపికెట్లను ముఖ్యఅతిథుల చేతుల మీదుగా అందజేశారు.
ఉన్నత లక్ష్యాలు సాధించాలి
క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పంతో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎంపీ వేమిరెడ్డి తెలిపారు. జిల్లాలోని భవిత కేంద్రాల్లో పదిలో ఉత్తమ మార్కులు సాధించిన అంధ విద్యార్థులకు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఉన్నత విద్యకు తమవంతు సహాకారం అందిస్తామన్నారు. ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ ఒకటి నుంచి 10 వరకు విద్యార్థులకు రెండు వేల స్టూడెంట్ కిట్స్ను సిద్ధం చేశామన్నారు. పీఎంశ్రీ పథకం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 12 కేజీబీవీల్లో సుమారు 3,200 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారని, 38 భవిత కేంద్రాల్లో దివ్యాంగ విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. ఈకార్యక్రమంలో డీఈఓ బాలాజీరావు, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, డీవీఈఓ మధుబాబు, ఆర్ఐఓ వరప్రసాదరావు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.