
రంగూన్ కలప కొల్లగొట్టే ప్లాన్
ఆత్మకూరు: పురాతన కట్టడాలను ఆయా ప్రాంతాల్లో స్మారక చిహ్నాలుగా ఉంచడం పరిపాటి. అయితే ఐదు రోజుల క్రితం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని శిథిలమైందన్న సాకుతో ఎలాంటి ప్రొసీజర్లు పాటించకుండా కూల్చి వేసి రూ.5 లక్షల విలువైన రంగూన్ టేకు కలపను రాత్రికిరాత్రి పట్టణం దాటించేశారు. మంత్రి అండదండలతో టీడీపీ నాయకులు ఈ కార్యక్రమం పూర్తి చేశారేమోనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ భవనాలు శిథిలమైతే వాటికి మరమ్మతులు చేయాలన్నా, తొలగించాలన్నా సంబంధిత ఇంజనీరింగ్ విభాగం వారు ఎస్టిమేషన్ వేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపి వారి ఆమోదం మేరకు తొలగించాల్సి వస్తే పేపరులో ప్రకటించడం, టెండర్లు నిర్వహించడం చేయాలి. కూల్చివేసే భవనాల్లో విలువైన టేకు లేదా కొయ్య పరికరాలు ఉంటే వాటిని సంబంధిత ఏఈ ఆధ్వర్యంలో భద్రపరచాలి. వాటిని అమ్మాలన్నా, ఎస్టిమేషన్లు వేసి ఉన్నతాధికారుల ఆదేశాలతో వేలం నిర్వహించాలి. ఇదంతా ఓ ప్రొసీజర్. అయితే ఆత్మకూరులో కూల్చివేసిన ఆ బ్రిటీష్ కాలం నాటి భవనం విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఆరు నెలల క్రితం తీర్మానం చేసి, కూల్చివేశారని ఆరోపణలు వస్తున్నాయి.
కలప ఏదీ...?
ఈ కూల్చివేసిన భవనంలో లక్షలాది రూపాయల విలువైన రంగూన్ టేకు ఉందని పలువురు పేర్కొంటున్నారు. వాటిని సంబంధిత పంచాయతీరాజ్ ఏఈ ఆధీనంలో సురక్షితంగా ఉంచాలి. కానీ వారి కార్యాలయంలోగానీ, ఆయన ఆధీనంలోగానీ ఈ టేకు కొయ్యలు లేకపోగా, మండలంలోని చెర్లోయడవల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ వ్యక్తి ఆధీనంలో ఉంచినట్లు సమాచారం. అసలు ఎంత కలప వచ్చింది పరిశీలించేందుకు భవనం తొలగించే క్రమంలో సంబంధిత ఏఈ పర్యవేక్షించలేదని సమాచారం. కాగా ఈ విషయమై పంచాయతీరాజ్ డీఈఈ, ఏఈలను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. ఇన్ఛార్జి ఎంపీడీఓను సంప్రదించగా డేవిడ్ను సంప్రదించగా తాను ఇటీవలే ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించానని, ఈ ఏడాది జనవరిలో మండల పరిషత్ సమావేశంలో పాడుబడిన ఎంపీడీఓ కార్యాలయాన్ని కూల్చివేయాలని పీఆర్ ఏఈ రూ.1.68 లక్షలకు కూల్చివేతకు ఎస్టిమేషన్ వేసి రికార్డులో నమోదు చేసినట్లు తెలిపారు. భవనంలో వచ్చిన పాత కలపను సేకరించి ఏఈ ఆధ్వర్యంలో భద్రపరచాలని, దానిని వేలం వేస్తే రూ.1.96 లక్షల విలువ తగ్గకుండా వేయవచ్చునని ఏఈ తెలిపినట్లు ఇన్చార్జి ఎంపీడీఓ వివరించారు. ప్రస్తుతం ఏఈ ఆధీనంలో కలప ఉందన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎంపీడీఓ భవనం కూల్చివేత
గుట్టుచప్పుడు కాకుండా పనిపూర్తి
రాత్రికి రాత్రే కలపను టీడీపీ నేత
ఇంటికి తరలించిన వైనం

రంగూన్ కలప కొల్లగొట్టే ప్లాన్