
మరో కరోనా కేసు నమోదు
నెల్లూరు (అర్బన్): జిల్లాలో చాపకింద నీరులా కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్నాయి. గురువారం ఒక్క రోజే 6 మందికి కరోనా నిర్ధారణ కాగా, శుక్రవారం దర్గామిట్టలోని ప్రభుత్వ పెద్దాస్పత్రిలో 27 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా మరొకరికి కరోనా నిర్ధారణ అయింది. నెల్లూరు మూలాపేటకు చెందిన 22 ఏళ్ల యువకుడికి కరోనా నిర్ధారణ కావడం, అతనికి స్పల్ప లక్షణాలుండడంతో హోం ఐసోలేషన్లో ఉంచారు. ఇప్పటికి మొత్తం 7 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో జిల్లా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ఎక్కడ?
జిల్లాలో 52 పీహెచ్సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, 10 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీలు) 2 ఏరియా ఆస్పత్రులు, ఆత్మకూరులో ఒక జిల్లా ఆస్పత్రి ఉన్నాయి. వీటిల్లో ఎక్కడా కరోనా పరీక్షలు చేయడం లేదు. నెల్లూరులోని పెద్దాస్పత్రిలో మాత్రమే అనుమానం వస్తేనే కరోనా పరీక్షలు చేస్తున్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ప్రక్రియ ఎక్కడా జరగడం లేదు. దీంతో ఇతర ప్రాంతాల్లో కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా రోజురోజుకు విస్తరిస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కనీసం పరీక్షలు కూడా చేయడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. 2020 మార్చి 8న రాష్ట్రంలోనే తొలిసారిగా నెల్లూరులో కరోనా కేసు వెలుగు చూసింది. నాటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీల్లో కరోనా పరీక్షలు చేసేలా చర్యలు చేపట్టింది. అప్పట్లో కరోనా కేసులు వెలుగు చూసిన చోట ప్రతి రోజు వైద్యశాఖ సిబ్బంది వారికి తగిన మందులు ఇచ్చి రోజూ పర్యవేక్షించేవారు. ఇప్పుడు కరోనా సోకిన వారి సంగతి పట్టించుకోవడం మానేశారు. ఇకనైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పెద్దాస్పత్రిలో మినహా
కరోనా పరీక్షలు ఎక్కడ?
ఇక్కడ కూడా అనుమానం వస్తేనే.. లేదంటే అంతే
జిల్లాలో 7కి చేరిన కేసులు