
యోగ జీవితంలో భాగం కావాలి
● ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్
నెల్లూరు(స్టోన్హౌస్పేట): మానసికంగా, శారీరకంగా అద్భుత ప్రయోజనాలు కలిగించే యోగాను ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కె కార్తీక్ పిలుపునిచ్చారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన రెసిడెన్షియల్ థీమాటిక్ రాష్ట్రస్థాయి సామూహిక యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కె కార్తీక్ హాజరుకాగా, జ్యోతి ప్రజ్వలనతో యోగాసనాలను ప్రారంభించారు. యోగా గురువు స్వప్న ఆధ్వర్యంలో చిన్నారులు సాధన్, దివ్య వేసిన యోగాసనాలు అందరినీ ఔరా అనిపించాయి. ప్రతి ఆసనానికి తగిన విధంగా శరీరాకృతిని అవలీలగా మారుస్తూ వేసిన ఆసనాలు ప్రత్యేకతను చాటాయి. ప్రజలందరూ కూడా యోగాను ఒక దినచర్యగా మార్చుకోవాలనేది ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశంగా కలెక్టర్ చెప్పారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున జిల్లాలో 2వేల ప్రదేశాల్లో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాల్లో ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, డిప్యూటీ డైరెక్టర్ మాధురి, జిల్లా క్రీడాప్రాధికారసంస్థ అధికారి యతిరాజ్, జిల్లా ఆయూష్ అధికారి గోవిందయ్య, యోగా గురువులు తదితరులు పాల్గొన్నారు.