
పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ
నెల్లూరు (టౌన్): రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మెగా డీఎస్సీపై అభ్యర్థుల్లో పలు ఆనుమానాలు రేకెత్తుతున్నాయి. నోటిఫికేషన్ తరువాత తగినంత సమయం ఇవ్వక పోవడం, అర్హత మార్కులను పెంచి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 700కు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులు ఉంటే డీఎస్సీ అభ్యర్థులకు ఎక్కడ నుంచి పోస్టులు ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 117 ఎస్జీటీ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు క్వాలిఫైయింగ్కు అర్హతైన ఇంటర్లో 50 శాతం మార్కులు, స్కూల్ అసిస్టెంట్ల పోస్టులకు క్వాలిఫైయింగ్కు అర్హతైన డిగ్రీలో 50 శాతం మార్కులు నిబంధనలను అమలు చేసింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు అర్హత శాతాన్ని 45 నుంచి 40 వరకు తగ్గించారు. ఈ నేపథ్యంలో మాకు కూడా తగ్గించాలని ఓపెన్ కేటగిరి అభ్యర్థులు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే కొంతమంది అభ్యర్ధులకు సూదూర ప్రాంతాల్లో సెంటర్లు కేటాయించారు. చైన్నె, తిరుపతి, ఒంగోలు తదితర సెంటర్లు కేటాయించారు. ఒక్కో అభ్యర్థి నాలుగైదు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడంతో ఒకే రోజు, ఒకే సమయానికి రెండు పరీక్షలు రాయాల్సిన పరిస్ధితి ఉంది. ఈ రీతిలో డీఎస్సీ అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో వేలాది మంది అభ్యర్థుల్లో పోస్టుల ఆందోళన నెలకొంది.
నార్మలైజేషన్పై ఆందోళన
డీఎస్సీ పరీక్షల నిర్వహణలో నార్మలైజేషన్పై పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని ఎస్జీటీలు అందరికీ ఒకే రోజు పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఒక సబ్జక్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కూడా ఒకే రోజు పరీక్ష నిర్వహించాలని చెబుతున్నారు. ఒక సబ్జక్టు లేదా ఎజ్జీటీలకు ఎక్కువ రోజులు పరీక్ష నిర్వహించడం వల్ల ప్రశ్నాపత్రంలో మార్పు వస్తుందన్నారు. ఒకరోజు సులభంగా మరొక రోజు కష్టంగా రావడంతో యావరేజి తీసుకోవడం వల్ల కొంతమంది అభ్యర్థులు నష్టపోతారని చెబుతున్నారు.
ఒక్కో పోస్టుకు 46 మంది పోటీ
నేటి నుంచే పరీక్షలు
నేటి నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు
ఉమ్మడి జిల్లాలో 8 సెంటర్లలో
పోస్టులు 673.. దరఖాస్తులు 31,221
జిల్లాలో 700కు పైగా
స్కూల్ అసిస్టెంట్ల మిగులు
ఉద్యోగం సాధించినా పోస్టింగ్పై
అనుమానాలు
డీఎస్సీ పరీక్షలు ఈనెల 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. జిల్లాలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోటలోని ఎన్బీకేఆర్లో రెండు సెంటర్లు, నారాయణ ఇంజినీరింగ్ కళాశాల నెల్లూరు, గూడూరు, పొట్టేపాలెంలోని ఆయాన్ డిజిటల్ సెంటర్, కోవూరులోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాల, కావలిలోని ఆర్ఎస్ఆర్, పీబీఆర్ విశ్వోదయ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 31,221 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయి.
పకడ్బందీగా పరీక్షలు
శుక్రవారం నుంచి జరగనున్న డీఎస్సీ పరీక్షలను పకడ్భందీగా నిర్వహిస్తాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లును పూర్తి చేశాం. హాల్టికెట్లో పుట్టిన తేది, జన్మస్థలం, పేరు తదితర వాటిల్లో పొరబాట్లు ఉంటే పరీక్ష రోజున సెంటరులో చీఫ్ సూపరింటెండెంట్ వద్ద నున్న నామినల్ రోల్స్ సరిచేసుకోచ్చు. హాల్ టికెట్లో ఫొటో లేకుంటే రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, గుర్తింపు కార్డును తీసుకురావాలి. అభ్యర్థులు వారికి కేటాయించిన సెంటర్లకు సకాలంలో చేరుకోవాలి.
– ఆర్.బాలాజీరావు, డీఈఓ
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 673 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలోని జిల్లా పరిషత్తు, ప్రభుత్వ, మున్సిపాల్టీ, మండల ప్రజా పరిషత్తులో 668 పోస్టులు, మిగిలిన 5 పోస్టులు ట్రైబల్ ఆశ్రమ పాఠశాలల్లో ఉన్నాయి. మొత్తం 673 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు. ఒక్కో పోస్టుకు 46 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే జిల్లాలో 700కు పైగా స్కూల్ అసిస్టెంట్లు మిగులు ఉన్నట్లు జిల్లా అధికారులు లెక్కలు తేల్చారు. ఎజ్జీటీ పోస్టులు కూడా కేవలం 117 ఖాళీలు ఉన్నట్లు లెక్కలు చెప్పారు. దీంతో డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎక్కడ నుంచి పోస్టులు తీసుకువస్తారని ప్రశ్నిస్తున్నారు.