
పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు
● ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్
నెల్లూరు రూరల్: డీఎస్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లపై ఇన్చార్జి కలెక్టర్ కె కార్తీక్ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేసి, బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎండతీవ్రత దృష్ట్యా అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులను పరీక్షా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని డీఎంఅండ్హెచ్వోకు సూచించారు. విద్యుత్కు అంతరాయం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ ఉదయభాస్కర్రావు, డీఈఓ బాలాజీరావు, డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సుజాత, కావలి, నెల్లూరు ఆర్డీవోలు వంశీకృష్ణ, అనూష తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖలో 42 మందికి స్థానచలనం
నెల్లూరు (టౌన్): జిల్లా విద్యాశాఖలో భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగులు బదిలీ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 42 మంది అధికారులు, ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. బదిలీ అయిన ఉద్యోగులు వెంటనే వారికి కేటాయించిన స్థానాల్లో జాయిన్ కావాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖాధికారులు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న బి.పద్మకుమారిని ప్రకాశం జిల్లా ఒంగోలు విద్యాశాఖ కార్యాలయానికి బదిలీ చేశారు. అక్కడ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న వి.విజయకుమార్ నెల్లూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి బదిలీ అయ్యారు. జిల్లా విద్యాశాఖలో ఏపీ ఓపెన్స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ ఎస్కే అసదుల్లాఖాన్ కర్నూలు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడీగా బదిలీ అయ్యారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, 17 మంది సీనియర్ అసిస్టెంట్లు, 12 మంది రికార్డు అసిస్టెంట్లు, ఐదుగురు ఆఫీసు సబార్డినేటర్లు, గార్డెనర్–1, వాచ్మన్–1 వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు.
డీసీపల్లిలో 506
పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో గురువారం 506 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 622 బేళ్లు రాగా వాటిలో 506 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 65174.7 కిలోల పొగాకును విక్రయించగా రూ.1,52,29,337.80 వ్యాపారం జరిగింది. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.280 కాగా కనిష్ట ధర రూ.180 లభించింది. మొత్తం మీద సగటు ధర రూ.233.67గా నమోదయింది. వేలంలో 9 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
9న జెడ్పీ ఉద్యోగులకు
బదిలీల కౌన్సెలింగ్
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈనెల 9వ తేదీన బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ విద్యారమ తెలిపారు. ఐదేళ్లు పైబడిన ఉద్యోగుల అభ్యర్థన మేరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఏఓలు, పరిపాలనాధికారులు, సీనియర్, జూనియర్ సహాయకులు, టైపిస్టులు, రికార్డు, ల్యాబ్ లైబ్రరీ సహాయకులు, ఆఫీసు సబార్డినేటర్లను బదిలీలు చేయనున్నారు. దీనికి సంబంధించి సీనియార్టీ జాబితాను కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. ఉద్యోగులందరూ కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరు కావాలని, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్కాకుల పెంచలయ్య, ప్రసన్నకుమార్లు కోరారు.
ప్లీజ్.. కంకర క్వారీకి లీజ్ వద్దు
ఉదయగిరి రూరల్: మండలంలోని తిరుమలాపురం గ్రామ సమీపంలో ఉన్న కొండను కంకర క్వారీకి లీజుకు ఇవ్వవద్దని గురువారం పలువురు గ్రామస్తులు తహసీల్దార్ సుభద్రకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ 178 సర్వే నంబరులోని 123.50 ఎకరాల విస్తీర్ణం గల కొండ పోరంబోకు భూమిని ప్రభు త్వం కంకర క్వారీ తవ్వకానికి లీజుకు ఇచ్చేందుకు గ్రామంలో ఏ–1 నోటీసు జారీ చేసిందన్నారు. కొండకు దగ్గరగా నివాస గృహాలు ఉన్నాయని, లీజు ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.