
ప్రకృతిని కాపాడుకుందాం
● ఇన్చార్జి కలెక్టర్, కమిషనర్
నెల్లూరు(బారకాసు): ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఇన్చార్జి కలెక్టర్ కె.కార్తీక్, నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, కార్పొరేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ‘ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్’ అంశంపై అవగాహన ర్యాలీని గురువారం ఉదయం నిర్వహించారు. స్థానిక వీఆర్ కళాశాల కూడలి నుంచి ర్యాలీని కార్తీక్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్న వారితో కలెక్టర్ ప్రతిజ్ఞను చేయించారు. నార సంచులను పంపిణీ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలు, నడక పోటీలు, మారథాన్ వంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తామని తెలిపారు. ర్యాలీలో జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ అశోక్కుమార్, నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అటవీ శాఖ సిబ్బంది, గ్రామ/వార్డు సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.