
నగదు తీసుకెళ్తుండగా..
పొదలకూరు: మండలంలోని చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు బంగారు నగలను బ్యాంక్లో కుదువపెట్టి నగదు తీసుకెళ్తుండగా తస్కరించిన వైనం పొదలకూరు బస్టాండ్లో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. రైతు వరికూటి రామకృష్ణారెడ్డి బ్యాంక్లో బంగారు నగలను కుదువపెట్టి వ్యవసాయ అవసరాల కోసం రూ.86 వేలు తీసుకున్నాడు. బ్యాంక్లో నగదు తీసుకుంటున్న సమయం నుంచే ఓ యువకుడు గమనించినట్టుగా తెలుస్తోంది. రైతు తన బైక్ ట్యాంక్ కవర్లో నగదు కవర్ను పెట్టి మధ్యాహ్నం హోటల్లో భోజనం చేశాడు. ఆ సమయంలోనే ముంబై ప్రాంతానికి చెందిన అశోక్ అనే యువకుడు నగదును తస్కరించే యత్నం చేశాడు. అక్కడ వీలుపడకపోవడంతో రామకృష్ణారెడ్డి బస్టాండ్లో అరటిపండ్లు కొనుగోలు చేస్తున్న సమయంలో నగదు కవర్ను యువకుడు తస్కరించి పరిగెత్తాడు. వెంటనే తేరుకున్న రైతు బైక్పై వెంబడించి స్థానిక సినిమా హాలు ఎదురు సందులో అతడిని పట్టుకున్నాడు. రైతుకు బాసటగా నిలిచిన స్థానిక వ్యాపారులు అశోక్కు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే తెలుగు మాట్లాడలేని ఆ యువకుడు తస్కరించిన నగదును మరో యువకుడికి అందజేసి సినీ ఫక్కీలో దాటించినట్టుగా చెప్పుకొంటున్నారు. పోలీసులు అశోక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన తల్లితో ప్లాస్టిక్ సామగ్రి అమ్ముకునేందుకు వచ్చానని అతను చెప్పాడని, అయితే పట్టణంలో అతడికి సంబంధించిన వారు ఎవరూ లేనట్టు సమాచారం. ఆ యువకుడు వద్ద చాకు, ఇతర మారణాయుధాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్సై ఎస్కే హనీఫ్ పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.
చోరీ చేసిన వ్యక్తి
పట్టుకుని దేహశుద్ధి చేసిన జనం