
కూటమి పాలనలో రోడ్డున పడిన ప్రజలు
నెల్లూరు (స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎంతో మంది పేదలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, వ్యాపారస్తులు, పెన్షనర్లు, వృద్ధులు రోడ్డున పడ్డారని వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరు సిటీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి నేతలు అధికారంలోకి రావడం కోసం ఎన్నో మాయమాటలు చెప్పారన్నారు. అయితే ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకే ఏదో మేలు చేసినట్లు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్లు సంబరాలు చేసుకుంటుందన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 3 లక్షల మంది ఉద్యోగులను రోడ్డును పడేసిందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు అన్నదాతసుఖీభవ, నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు చొప్పున ఏడాదికి రూ.36 వేలు, మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, 50 ఏళ్లు నిండిన మహిళలకు పింఛన్ ఇస్తామన్నారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ అని ఇలా అనేక హామీలిచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రతి ఒక్కరిని మోసం చేసి సంబరాలు చేసుకోవడానికి సిద్ధమైందన్నారు. విద్యుత్ చార్జీలను ప్రభుత్వం విపరీతంగా పెంచిందన్నారు. కూటమి ఏడాది పాలన తర్వాత వైఫల్యాలను, మోసాలను నిలదీస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధం కావడానికి.. బుధవారం కూటమి వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేతిలో నష్టపోయిన ప్రతి వర్గం ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కోరారు. నగరంలోని వీఆర్సీ సెంటర్లో ఉదయం 10 గంటలకు వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలతో కలిసి కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు వీఆర్ కళాశాల వద్దకు తప్పకుండా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
నేడు కూటమి వెన్నుపోటు దినం
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
విజయవంతం చేయాలని పిలుపు