
జీజీహెచ్లో ‘గుండె’కు భరోసా
నెల్లూరు (అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్)లో క్యాథ్ ల్యాబ్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. గుండెకు సంబంధించి బైపాస్ సర్జరీ, స్టంట్లు వేసే సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు రూ.5.67 కోట్లతో క్యాథ్ ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నారు. ఓపీ సేవలు పెరగడం, ఆపరేషన్లు పెరగడం, కనీస వసతులు మెరుగుపడడంతోపాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నిబంధనలు పూర్తిగా ఆచరించడంతో ఇటీవల ఆస్పత్రికి గుండె విభాగాన్ని మంజూరు చేశారు. అందులో భాగంగా వారం క్రితమే హార్ట్ స్పెషలిస్టు డాక్టర్ మంజులను నియమించడంతో ఆమె విధుల్లో చేరారు. మరో ముగ్గురు గుండె వైద్య నిపుణులను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నియమించనుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో గుండె వ్యాధులకు సంబంధించి వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో రానున్నాయి. బైపాస్ సర్జరీ చేయాల్సి ఉన్నా.. స్టంట్లు వేయాల్సి ఉన్నా.. ఇకపై ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి రూ.లక్షలకు, లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.
రూ.5.67 కోట్లతో క్యాథ్ ల్యాబ్
అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ సేవలు
బైపాస్ సర్జరీ, స్టంట్లు
వేసేందుకు అవకాశం
గుండె జబ్బులకు నాణ్యమైన వైద్యం
జీజీహెచ్లో గుండె వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయాలని చాలా కాలంగా అడుగుతున్నాం. ఎన్ఎంసీ నామ్స్ అనుసరిస్తున్న నేపథ్యంలో గుండె విభాగంతో పాటు క్యాథ్ ల్యాబ్ మంజూరు కావడం ఎంతో సంతోషం. దీంతో పేద రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించగలుగుతాం. అన్ని రకాల గుండె జబ్బులకు వైద్యసేవలు అందుతాయి.
– డాక్టర్ సిద్ధానాయక్, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి