
కొంత భూమి వదులుకోండి
● దళితుల భూముల విషయంలో
ఎస్సై పంచాయితీ
చేజర్ల(ఆత్మకూరు): చేజర్ల మండలంలోని పెళ్లేరు పంచాయతీ పుల్లనీళ్లపల్లి గ్రామంలోని దళితులకు ప్రభుత్వం అందజేసిన భూములపై వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనిపై సాక్షిలో మంగళవారం దళితుల భూములపై టీడీపీ నేత కన్ను అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. చేజర్ల ఎస్సై తిరుమలరావు బాధిత దళితులు, సదరు నాయకులను స్టేషన్కు పిలిపించారు. ఆయనే పంచాయితీ నిర్వహించారు. మాజీ సైనికుడు పెంచలయ్య కుటుంబీకుల కథనం మేరకు.. రెండున్నర ఎకరాల భూమి వదులుకోవాలని, మిగిలింది మీరే ఉంచుకోవాలని ఎస్సై అనడంతో తాము ఒప్పుకోలేదన్నారు. అన్ని పత్రాలున్నాయని, వాటి రుజువుల మేరకు భూములు మాకే చెందుతాయని పేర్కొనడంతో స్థానిక టీడీపీ నాయకుడు మరోచోట పోరంబోకు భూమి చూపుతానని, దానిని తీసుకోవాలని దబాయించాడు. ఎస్సై సైతం ఆ నాయకుడికే మద్దతుగా మాట్లాడినట్లు పెంచలయ్య కుటుంబీకులు వాపోయారు. ఇరువర్గాలను స్టేషన్కు పిలిపించిన క్రమంలో టీడీపీ నాయకులను కూర్చోబెట్టి, దళితులను నిలబెట్టి ఎస్సై పంచాయితీ చేశారన్నారు. తమ సెల్ఫోన్లను సైతం ముందుగానే తీసుకుని పంచాయితీ పూర్తయ్యే వరకు వారి వద్దనే ఉంచుకున్నట్లు చెప్పారు. టీడీపీ వారి ఫోన్లను మాత్రం అనుమతించినట్లు పేర్కొన్నారు.