
నేరస్తులపై ఉక్కుపాదం
● పోలీసు అధికారులను ఆదేశించిన ఐజీ
నెల్లూరు (క్రైమ్): శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎవరినీ ఉపేక్షించొద్దు. నేరస్తులపై ఉక్కుపాదం మోపండి. తొలుత కౌన్సెలింగ్ నిర్వహించి బైండోవర్ చేయండి, అతిక్రమిస్తే జరిమానాలు విధించడంతోపాటు అవసరమైతే ఆస్తులను జప్తు చేయాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో జిల్లా పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐజీ మాట్లాడుతూ నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. విజిబుల్ పోలీసింగ్, డ్రోన్ సర్వైలెన్స్ను పెంచాలన్నారు. రౌడీషీటర్లు, డీసీలు, కేడీలు, సస్పెక్ట్ షీటర్ల కదలికలను నిశితంగా పరిశీలిస్తూ ఉండాలన్నారు. పదే పదే నేరాలకు పాల్పడుతోన్న వారిని గుర్తించి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. తీరు మారని వారిపై అవసరమైతే పీడీయాక్ట్లు నమోదు చేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కేసుల్లో దర్యాప్తులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అదృశ్యం, చిన్నారులు, మహిళలకు సంబంధించిన కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు కేసుల పెండెన్సీని తగ్గించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్నీ చర్యలు చేపట్టాలన్నారు. తొలుత జిల్లాలో కేసుల పెండెన్సీని తగ్గించేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఎస్పీ జి.కృష్ణకాంత్ ఐజీకి వివరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీఎస్పీలు సింధుప్రియ, శ్రీనివాసరావు, సీఐలు, తదితరులు పాల్గొన్నారు.