
కరెంట్ తీగలే.. యమపాశాలు
● 11 కేవీ వైరు తగిలి
ఇద్దరు కంటైనర్ల డ్రైవర్ల మృతి
● మృతులు తమిళనాడు వాసులు
విడవలూరు: వేలాడే కరెంట్ తీగలు వారి పాలిట యమపాశాలుగా మారాయి. బతుకుదెరువు కోసం తమిళనాడు నుంచి ఊరు గాని ఊరు వచ్చి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మండలంలోని ముదివర్తిలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. తమిళనాడు రాష్ట్రం చెట్టికుప్పంకు చెందిన దక్షిణామూర్తి వైద్యనాథన్ (40) సుబ్రహ్మణ్యం మణి (44), వినయగమ్ అక్కడే గోల్డ్ మైరెన్ హార్వెస్ట్ హేచరీ నుంచి రొయ్య పిల్లల లోడుతో మూడు కంటైనర్లలో బయలుదేరి ఆదివారం రాత్రి మండలంలోని ముదివర్తిలో కనుపర్తి రాధయ్య రొయ్యల గుంతల వద్దకు చేరుకున్నారు. రొయ్య పిల్లలు అన్లోడ్ అయిన తర్వాత దక్షిణామూర్తి వైద్యనాథన్ కంటైనర్ను రివర్స్ చేస్తున్న క్రమంలో చీకట్లో 11 కేవీ వైరు స్తంభం నుంచి కింద జారి ఉండడాన్ని గమనించకపోవడంతో వైరు లారీ వెనుక భాగంలో తగిలింది. దీంతో కంటైనర్కు స్పార్క్ రావడంతో పక్కనే ఉన్న మరో ఇద్దరు లారీ డ్రైవర్లు పెద్దగా కేకలు వేశారు. దీంతో వైద్యనాథన్ లారీ నుంచి కిందకు దూకే క్రమంలో కరెంట్ షాక్కు గురై అక్కడే పడిపోయాడు. ఆయన్ను కాపాడే క్రమంలో మరో కంటైనర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మణికి లారీ తగలడంతో ఆయన కూడా విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు దీంతో చుట్టు పక్కల ఉన్న వారు వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కరెంట్ కట్ చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని విచారించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి బంధువులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న దక్షిణామూర్తి వైద్యనాథన్ తమ్ముడు సుబ్బారాయన్ ఆర్ముగమ్ సోమవారం స్థానిక పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. దీంతో రెండు కంటైనర్లను పోలీస్స్టేషన్కు తరలించారు. ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీజీహెచ్లో ఇద్దరు కంటైనర్ డ్రైవర్ల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించారు.

కరెంట్ తీగలే.. యమపాశాలు