
దమ్ముంటే కేసును సీబీఐకి అప్పగించాలి
● మాజీ మంత్రి ప్రసన్నకుమార్రెడ్డి
నెల్లూరు(స్టోన్హౌస్పేట): మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిపై అక్రమ కేసు బనాయించి రిమాండ్కు పంపించడం కాదని, చంద్రబాబు, లోకేశ్, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే సీబీఐకి కేసును అప్పగించాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పీఏసీ సభ్యుడు నల్లపరెడి ప్రసన్నకుమార్రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు డైకస్రోడ్డులో ఉన్న కాకాణి గృహానికి ప్రసన్న తన కుటుంబ సభ్యులతో ఆదివారం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవర్ధన్రెడ్డి నిత్యం ప్రజల కోసం పోరాడే వ్యక్తి అని, అందరూ బాగుండాలని పార్టీ పటిష్టంగా ఉండాలని కోరుకునే వ్యక్తిపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయమన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆయన కొడుకు చేస్తున్న అరాచకాలను కాకాణి ఎండగడుతుంటే సహించలేక అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్ష సాధిస్తున్నారన్నారు. తిరిగి తమ ప్రభుత్వం వస్తుందని, ఇంతకు రెట్టింపు పని పడతామని, వదిలే ప్రసక్తే లేదన్నారు. సీబీఐకి కేసును అప్పగించాలని కాకాణి కుమార్తె పూజిత ఇన్చార్జి కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారన్నారు. ప్రభుత్వం మీదే కాబట్టి ధైర్యం ఉంటే మోదీకి చెప్పి కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. కాకాణికి మంచి పేరుందని, త్వరలో నిజాయతీగా బయటకు వస్తారని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పూజితకు ధైర్యం చెప్పిన వారిలో ప్రసన్న సతీమణి గీతారెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం కోవూరు నియోజకవర్గ అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్కుమార్రెడ్డి, ఆయన సతీమణి పూజారెడ్డి ఉన్నారు.