
కోర్టు కానిస్టేబుల్పై ఫిర్యాదు
సంగం: సంగం పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కోర్టు కానిస్టేబుల్ తన వదినకు డబ్బులిప్పించి మోసం చేశాడని అన్నారెడ్డిపాళెం, బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన పలువురు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం సంగం ఎస్సై రాజేష్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. కానిస్టేబుల్గా పనిచేస్తున్న వెంకటబాబు అన్నారెడ్డిపాళెంలో నివాసముంటున్న తన వదిన శైలజకు నాలుగేళ్ల క్రితం బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాసరావు నుంచి రూ.6 లక్షలు ఇప్పించాడు. ఆ సమయంలో ఆమె బ్యాంక్లో బంగారాన్ని విడిపించి మరుసటి రోజు నగదు ఇస్తామని నమ్మబలికాడు. శైలజ బంగారం విడిపించి డబ్బు ఇవ్వడానికి కాలయాపన చేసింది. పలుదఫాలు వెంకటబాబును డబ్బు అడగ్గా పోలీస్నంటూ బెదిరించేవాడని బాధితుడు వాపోయాడు. కొద్దిరోజుల తర్వాత శైలజ నుంచి శ్రీనివాసరావుకు ప్రాంసరీ నోట్లు ఇప్పించాడు. ఏడాది తర్వాత శ్రీనివాసరావు లైంగికదాడి చేయబోయినట్లు శైలజ చేత బుచ్చి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయించాడు. జరిగిన విషయాన్ని శ్రీనివాసరావు ఉన్నతాఽధికారులకు వివరించినా ఫలితం లేకుండా పోయింది. రెండేళ్ల క్రితం అన్నారెడ్డిపాళేనికి చెందిన సుశీలమ్మ అనే మహిళ శైలజకు రూ.3.50 లక్షలిచ్చింది. నాలుగు రోజుల క్రితం ఆమె డబ్బులు తిరిగి అడిగింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. శైలజను సుశీలతోపాటు మరికొందరు కొట్టారని సంగం పోలీస్స్టేషన్లో వెంకటబాబు అక్రమ కేసు నమోదు చేయించాడు. దీంతో బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన కొంతమంది బాఽధితులు ఆదివారం శైలజ అనే మహిళ రూ.20 లక్షలు తమ వద్ద తీసుకుని, అడిగితే అట్రాసిటీ కేసు పెట్టిస్తానని బెదిరిస్తోందని కన్నీరుమున్నీరవుతూ స్థానిక పోలీస్స్టేషన్లో ఎస్సై ముందు వాపోయారు. అన్నారెడ్డిపాళెంలోని టీడీపీకి చెందిన చోటా నాయకుడి అండతో శైలజ పలువురిపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎస్సై తెలిపారు.