
విద్యావ్యవస్థను కాపాడుకుందాం
● నెల్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం
నెల్లూరు(టౌన్): పిల్లల భవిష్యత్ కోసం విద్యావ్యవస్థను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు సమైక్య శంఖారావం పూరించాల్సిన అవసరం ఉందని వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నాయకులు, విద్యావేత్తలు పిలుపునిచ్చారు. నెల్లూరు ఆదిత్యనగర్లోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఆదివారం పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్రాధ్యక్షుడు నరహరి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం 2009ను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అమలు చేయాలన్నారు. అసర్ 2024 నివేదికపై బహిరంగ చర్చ జరగాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు. ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణ తీరు, రీవాల్యుయేషన్ ఫలితాలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఫీజుల నియంత్రణ చట్టం అమలు, అందరికీ సమాన విద్య అందించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం, తల్లిదండ్రులు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు, వివిధ సంస్థలతో నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సమావేశంలో వివిధ సంఘాలకు చెందిన కోటా శ్రీనివాసులురెడ్డి, ఉడతా రాజశేఖర్యాదవ్, మహేష్కుమార్, నవకోటేశ్వరరావు, చలపతి, శ్రీనివాసులు, కోదండరామిరెడ్డి, మస్తాన్, మున్నా, ఆదిత్యసాయి, నిహాల్, మున్నా తదితరులు పాల్గొన్నారు.