
ధాన్యం ధరలు పాతాళానికి పతనం
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ధాన్యం ధరలే కాదు.. ఏ పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కాదు కదా.. కనీసం ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కే పరిస్థితి లేదు. చంద్రబాబు సీఎంగా దిగిపోయే 2004 సంవత్సరంలో కూడా పుట్టి ధాన్యం రూ.4 వేలు దాటిన చరిత్ర లేదు. ఆ తర్వాత వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లల్లో ధాన్యం ధరలు ఊహించని విధంగా ఏటా పెరిగాయి. వైఎస్సార్ హయాంలో పుట్టి ధాన్యం రూ.13 వేల వరకు ఎగబాకాయి. ఇక ప్రత్యేకించి జిలకర మసూరి రకం అయితే ఏకంగా రూ.17 వేల వరకు అప్పట్లోనే పలికాయి. తిరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2014–19 మధ్య కాలంలో మద్దతు ధరలు బాగా పెరిగినప్పటికీ.. పుట్టి రూ.10 వేల నుంచి రూ.11 వేలకు కొనే పరిస్థితి లేకుండా పోయింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న జిలకర మసూరి రకాన్ని సైతం మిల్లర్లకు మేలు చేకూర్చేందుకు ‘ఏ’ గ్రేడ్ రకంగా ముద్ర వేసి ఆ రకం ధాన్యం ధరల గుట్టకూల్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లూ మద్దతు ధరలు లభించేలా అనేక చర్యలు తీసుకున్నారు. గతేడాది పుట్టి మద్దత ధరకు మించి రూ.25 వేల వరకు రైతులు అమ్ముకున్నారు. తాజాగా పూర్తయిన ఖరీఫ్ సీజన్లో పుట్టి ధాన్యం రూ.15 వేల నుంచి రూ.17 వేల లోపే కొనుగోలు చేసిన పరిస్థితి తెలిసిందే. ఒక్క ధాన్యం ధరలే కాకుండా గతేడాదితో పోల్చితే.. పసుపు రైతు పుట్టీ ముంచారు. పొగాకు ధరలు అయితే కేజీకి రూ.100 తగ్గిపోయింది. మిర్చి ధరలు అయితే నేలచూపులు చూస్తున్నాయి. మామిడి, సపోటా, నిమ్మ, బత్తాయి ధరలు కూడా ఇదే రీతిలో ఉన్నాయి. రైతులకు గిట్టుబాటు కల్పించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పంటలకు ధరలు లేకపోతే ఎందుకు సాగు చేయడం అని సాక్షాత్తు వ్యవసాయశాఖ మంత్రి అంటారు. మరి ప్రభుత్వం ఉండేది ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ధాన్యం ధరలు పాతాళానికి పతనం