
అక్రమ కేసులతో పైశాచికం
నెల్లూరు (స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికొదిలేసి ప్రతిపక్ష పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ పైశాచిక ఆనందం పొందుతుందని, డైవర్షన్ రాజకీయాలతో పబ్బం గడుపుకుంటుందని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం కూటమి దాష్టీకాలను నిరసిస్తూ నలుపు వస్త్రాలు ధరించి, చేతికి నల్ల వస్త్రాలను సంకెళ్లుగా వేసుకుని మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై అక్రమ కేసు బనాయించి జైల్లో పెట్టి ఏదో ఘన కార్యం చేసినట్లు జబ్బలు చరుచుకుంటున్న కూటమి నేతలు సిగ్గుపడాలన్నారు. ఏడాదిగా చేసిన మోసాలను, అకృత్యాలపై నిలదీస్తున్న కాకాణిపై కక్ష పూరితంగా వ్యవహరించడం కంటే.. ఇంకేమి చేయలేదన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసాతో కూటమి దాష్టీకాలను ఎదుర్కొంటామన్నారు. రేపటి రోజున మా ప్రభుత్వం వస్తే మీరు ఇబ్బంది పెట్టినట్లుగా మేము వ్యవహరిస్తే టీడీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి చెప్పుకోవడం కాదు కదా కనీసం రోడ్ల మీదకు వచ్చి తిరగలేరన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, కాకాణి ఎలాంటి తప్పు చేయలేదని క్లీన్చిట్తో బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. అరెస్ట్లతో వైఎస్సార్సీపీ నేతలు ఎవరు బయపడరని, మరింత ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లి కూటమి విధానాలను ఎండగడుతారని తెలిపారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం నేత చీదెళ్ల కిషన్, సర్వేపల్లి ఐటీ వింగ్ అధ్యక్షుడు రావుల ఇంద్రసేనాగౌడ్, నాయకులు ఇంద్రసేనారెడ్డి, వెంకటేష్, మీరా, కిషోర్, మస్తాన్, దీపు, మనోజ సుమధర్, లోకేష్రెడ్డి పాల్గొన్నారు.
కూటమి డైవర్షన్ రాజకీయాలతో పబ్బం
వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు నాగార్జున