‘ఉపాధి’కి సదస్సులు దోహదం
ములుగు అటవీ కళాశాల డీన్ కృష్ణ
ములుగు(గజ్వేల్): కమ్యూనికేషన్ స్కిల్స్పై పట్టు సాధించడానికి సదస్సులు దోహదపడుతాయని కళాశాల డీన్ వి.కృష్ణ అన్నారు. బుధవారం ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ(ఎఫ్సీఆర్ఐ)లో ‘నాలెడ్జ్ కనెక్ట్ బియాండ్ క్లాస్ రూం అనే అంశంపై విద్యార్థులు, అధ్యాపకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను భవిష్యత్ ఉపాధి అవకాశాలకు సిద్ధం చేయడంతోపాటు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ ప్రవీణ, డిప్యూటీ డైరెక్టర్ కవిత పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
చిన్నశంకరంపేట(మెదక్): బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైన వ్యక్తి చికిత్స పొందుతు మృతి చెందాడు. ఈ సంఘటన నార్సింగిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సృజన కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన బక్కన్నగారి అంజిరెడ్డి(50) ఈ నెల ఒకటిన చేగుంటకు వ్యక్తిగత పని మీద వెళ్లారు. తిరిగి వస్తూ నార్సింగిలోని మహర్షి దయానంద పాఠశాల సమీపంలోని సర్వీస్రోడ్డులో కుక్కలు అడ్డురాగా బైక్ అదుపుతప్పి కిందపడడంతో తలకు తీవ్రగాయమైంది. వెంటనే హైదరాబద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మంగళవారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందాడు. భార్య సౌమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
తలకొరివి పెట్టిన కూతురు
కాగా, అంజిరెడ్డి అంత్యక్రియలను కూతురు తేజా నిర్వహించారు. తండ్రికి తనయ తలకొరివి పెట్టడంతో విషాదం నింపింది. కాగా అంత్యక్రియలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి సతీమణి కావ్యారెడ్డి హాజరై నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి
మనోహరాబాద్(తూప్రాన్): అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతిచెందిన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాకు చెందిన నరేశ్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లిలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ స్థానిక పరిశ్రమలో పని చేస్తున్నాడు. కాగా స్థానికులు గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు పక్కన పడిపోయి ఉన్నట్లు 108కు సమాచారం ఇచ్చారు. కాగా సిబ్బంది వ్యక్తిని పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులను సమాచారం అడగగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
హల్దీవాగులో వ్యక్తి గల్లంతు
వెల్దుర్తి(తూప్రాన్): హల్దీవాగులో ఎండ్రికాయలు వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన మండలంలోని హస్తాల్పూర్ శివారులో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని గంగిరెద్దులవాడకు చెందిన జానపాటి సాయిలు, ఆవుల దుర్గయ్య అలియాస్ శంకర్ (42) గ్రామ శివారులోని హల్దీవాగులోకి బుధవారం ఎండ్రికాయలు వేటకు వెళ్లారు. ఇరువురు ఎండ్రికాయలు పట్టుకొని బయటకు వస్తుండగా, దుర్గయ్య నీటిలో ఒక్కసారిగా మునిగిపోయాడు. దీంతో ఆందోళనకు గురైన సాయిలు గ్రామ పెద్దలకు చెప్పగా, వాగులో గాలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరికి మెదక్ నుంచి గజ ఈతగాళ్ల సాయంతో వెతికినా చీకటి పడడంతో ఆచూకీ లభ్యం కాలేదు.
కార్మికుల హక్కులు
కాలరాస్తున్న కేంద్రం
సీఐటీయూ జిల్లా కోశాధికారి భాస్కర్
దుబ్బాక: కార్మికుల చట్టాలను రద్దు చేసి, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను అమలులోకి తెచ్చి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని సీఐటీయూ జిల్లా కోశాధికారి భాస్కర్ అన్నారు. ఈ నెల 7,8,9వ తేదీల్లో మెదక్లో జరిగే సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనాలు రూ.26 వేలు అమలు చేయాలన్నారు. కార్మిక, ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం సమరశీల పోరాటాలు చేస్తున్న సీఐటీయూకు అండగా ఉండాలన్నారు. ఈ మహాసభలకు కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొంపల్లి భాస్కర్, నాగరాణి, రాజు, మహేశ్, నాగరాజు, ఎల్లం, సాజిత్, సంతోష్, స్వరూప, పద్మ, బాబాయ్, జ్యోతి, పోశవ్వ తదితరులు ఉన్నారు.
‘ఉపాధి’కి సదస్సులు దోహదం
‘ఉపాధి’కి సదస్సులు దోహదం


