మద్యం తాగేందుకు తీసుకెళ్లి..
గజ్వేల్: దొంగతనం కేసులో నిందితున్ని అరెస్ట్ చేసి, చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం గజ్వేల్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్స్పెక్టర్ రవికుమార్ కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 26న దౌల్తాబాద్ మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన నర్సయ్యను నిందితుడు పొత్తుల నాగరాజు కలిశాడు. మద్యం తాగుదామని పట్టణంలోని ఓ వైన్స్కు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం కొనుగోలు చేసి జాలిగామ బైపాస్ వైపు ఉన్న పొదల్లోకి తీసుకెళ్లాడు. మద్యం తాగిన తర్వాత నర్సయ్య వద్ద ఉన్న రెండు వెండి కడియాలు, రెండు వెండి ఉంగరాలు, ఒక బంగారు బాలిపోగును నాగరాజు చోరీ చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి, చోరీ సొత్తు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించడానికి కృషి చేసిన గజ్వేల్ అదనపు ఇన్స్పెక్టర్ ముత్యంరాజు, ఎస్ఐ మల్లారెడ్డి, కానిస్టేబుళ్లు రవి, సురేందర్, దివ్య, వెంకటేశ్, నాగేశ్ను ఏసీపీ నర్సింహులు అభినందించినట్లు తెలిపారు.
మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
సిద్దిపేటకమాన్: డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం ప్రకారం... సిద్దిపేట పట్టణంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన గడ్డం ప్రసాద్ 2025 మార్చిలో కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన బూర అమలకు కేసీఆర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని రూ.2లక్షల 50 వేలు తీసుకున్నాడు. కానీ ఇల్లు మాత్రం ఇప్పించలేదు. దీంతో విసిగిపోయిన బాధితురాలు ఈనెల 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. 14రోజుల రిమాండ్ విధించి కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. గతంలో కూడా పలువురిని మోసం చేశాడని, ఒక కేసు కూడా నమోదైనట్లు సీఐ ఉపేందర్ తెలిపారు.
మట్టిని అక్రమంగా అమ్మిన వ్యక్తి..
సిద్దిపేటకమాన్: ప్రభుత్వ భూమిలోని మట్టిని అక్రమంగా అమ్ముకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం ప్రకారం... మందపల్లి శివార్లలోని ప్రభుత్వ భూమి సర్వే నం. 382/87లోని మట్టిని 2025 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో గాంధీ రెడ్డి, వంశీ కృష్ణ ఒక ప్రైవేటు కంపెనీకి గోనెపల్లి గ్రామానికి చెందిన రాజు, యాదగిరి సహకారంతో విక్రయించారు. ఈ క్రమంలో మందపల్లి గ్రామ పరిపాలన అధికారి కరుణాకర్ ఈనెల 10న పొలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం పోలీసులు మండపల్లికి చెందిన గాంధీ రెడ్డిని అరెస్ట్ చేశారు. త్వరలో మిగతా వారిని అరెస్టు చేస్తామని తెలిపారు.
చోరీ కేసులో నిందితుని అరెస్ట్
మద్యం తాగేందుకు తీసుకెళ్లి..


