
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
దుద్యాల్: ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల కంటే ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులకే ఉన్నత చదువు, అనుభవం ఉంటుందని, నాణ్యమైన విద్య బోధించడంలో వారు ముందుంటారని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి పేర్కొన్నారు. శుక్రవారం దుద్యాల్ మండల పరిధిలోని చిలుముల మైల్వార్ పాఠశాలలో విద్యార్థులకు కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంఈవో విజయరామా రావుతో కలిసి పరిశీలించారు. శిక్షణ శిబిరం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు ఆసక్తి, విద్య, శారీరక సామర్థ్యాలు పెంచే విధంగా తగిన శిక్షణ అందించాలన్నారు. ముఖ్యంగా చదువుతో పాటు నృత్యం, డ్రాయింగ్, క్రీడలు, గణితం సంబంధిత అంశాల్లో మెలకువలు బోధించడంతో పాటు భాషా పరిజ్ఞానం పెంపొందించుకునేలా తయారు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
సాంకేతికత పెంచేందుకే
కృత్రిమ మేదస్సు శిక్షణ
1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు ముందస్తుగానే అధునాతన సాంకేతిక పెంచేందుకు కృత్రిమ మేదస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ) శిక్షణ అందిస్తున్నామని డీఈవో రేణుక దేవి తెలిపారు. కృత్రిమ మేదస్సు ద్వారా విద్యార్థులు చదవడం, నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం వంటి విధానాలు చాలా వేగంగా నేర్చుకుంటారన్నారు. కంప్యూటర్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని, అందుకు సంబంధించి విద్యార్థులకు లాగిన్ ఐడీ ద్వారా ఈ విషయాలు అందుతాయని అన్నారు. చదువుతో పాటు కథలు, తెలుగు, ఇంగ్లీష్, గణిత సంబంధిత అంశాలు కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు. కొడంగల్ నియోజకవర్గంలోని 265 పాఠశాలలో కృత్రిమ మేదస్సు శిక్షణ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
వార్షిక ప్రణాళిక ముందస్తుగానే తయారు చేసుకోవాలి
ప్రతీ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు వచ్చే అకాడమిక్ సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళికను ముందస్తుగానే తయారు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏ నెలలో ఏ పాఠ్యాంశం పూర్తి చేయాలి, అందుకు సంబంధించిన పరీక్షను ఎలా నిర్వహించుకోవాలి, అర్థం కాకుంటే విద్యార్థులకు ఎలాంటి వివరణ ఇస్తే బాగుంటాయో వంటి అంశాలను ఉపాధ్యాయుడు రాసుకుని తిరిగి విద్యార్థులకు బోధించాలి. పాఠ్యాంశ బోధనలో నిర్లక్ష్యం తగదని, వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా అకాడమిక్ సంవత్సరం మొదటి నుంచే ప్రణాళికలు తప్పనిసరిగా సిద్ధం చేసుకుంటే ఉత్తమం. అందుకు తగ్గట్టుగా విద్యా బోధన ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాదయ్య, ఉపాధ్యాయు లు ఆంజనేయులు, సంగమేశ్వర్, గోవర్ధన్, అనిల్ కుమార్, హన్మంతు, దివ్య శ్రీ, కవిత, గ్రామస్థులు శివ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు పట్టుదలతో బోధన చేపట్టాలి
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు తీసుకురావాలి
వేసవి శిక్షణ శిబిరంలో చదువుతో పాటు నృత్యం, డ్రాయింగ్, క్రీడలు
ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ముందస్తు ప్రణాళిక తప్పనిసరి
ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి రేణకాదేవి సూచన

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య