
రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాను ప్రారంభిస్తున్న జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ భారతి హోళికేరి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడిన కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బీమా పెంపు
అభినందనీయం
జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి
మహేశ్వరం: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం స్థానిక అధికారులు, వైద్యులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల బీమాను ప్రభుత్వం ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ.5 లక్షల బీమా అందుతోందని, కొత్త ప్రభుత్వం దానిని రూ.10 లక్షలకు పెంచిందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో బడంగ్పేట్ మేయర్, టీపీసీసీ కార్యదర్శి చిగురింత పారిజాత, కందుకూరు ఆర్డీఓ సూరజ్ కుమార్, తహసీల్దార్ మహమూద్ అలీ, మహేశ్వరం ఇన్చార్జి ఎంపీపీ సునితా నాయక్, కందుకూరు ఎంపీపీ మంద జ్యోతి, ఎంపీడీఓ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ
భక్తిభావంతో మెలగాలి
శంకర్పల్లి: ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలగాలని జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత సంఘటన కార్యదర్శి భాస్కర యోగి అన్నారు. మన సంస్కృతి సంప్రదాయలను గౌరవించటంలో భాగంగా ప్రజలు అనేక రూపాల్లో తమ భక్తిభావాన్ని వ్యక్త పరుస్తుంటారని తెలిపారు. మండలకేంద్రంలోని డీఎంఆర్ ఫంక్షన్హాల్లో ఆదివారం సామాజిక సమరసత ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కరయోగి మాట్లాడుతూ.. పంచభూతాలకు కులం, మతం, బీద, ధనిక వ్యత్యాసం లేదన్నారు. గాలి, నీరు భూమి, ఆకాశం, అగ్ని అందరినీ ఒకేలా చూస్తాయని చెప్పారు. ప్రజలందరినీ ఒకే దగ్గరికి చేర్చే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభి నందనీయమన్నారు. కార్యక్రమంలో విభాగ్ ప్రచారక్ దేవేందర్ రాజు, కార్యవాహ కేరెళ్లి అంతరెడ్డి, సామాజిక సమరసత కన్వీనర్ దామోదర్రెడ్డి, స్వయం సేవకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
ఆ జీవోను రద్దు చేసి న్యాయం చేయండి
హుడాకాంప్లెక్స్: జీవో 48పై కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేసి తమకు న్యాయం చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. కొత్తపేటలోని వీఎంహోం మైదానంలో ఆదివారం గతంలో కాంగ్రెస్ నాయకులను కలిసిన ఫొటోలను చూపిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 48 జీవోతో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందనే కాంగ్రెస్ పక్షాన నిలిచామని చెప్పారు. ఎంపిక సమయంలో తమకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.

సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్న భక్తులు

వీఎంహోం మైదానంలో ప్రదర్శన చేస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులు