
మురుగుతున్న నిర్లక్ష్యం
● సిరిసిల్ల బల్దియాలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ ● మోరీల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం ● మురికికూపాలుగా ఓపెన్ప్లాట్లు ● విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు
సిరిసిల్లటౌన్: వర్షాకాలం వ్యాధులు విజృంభిస్తున్నాయి. మోరీల్లోంచి మురుగునీరు రోడ్డుపై పారుతోంది. కచ్చానాలాలు దోమల ఆవాసాలయ్యాయి. ప్రధాన డ్రైనేజీలు ముక్కుపుటాలు అదిరేలా కంపుగొడుతున్నాయి. సిల్ట్ తీయడంలో బల్దియా నిర్లిప్తత, పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వెరసి స్వచ్ఛతలో సిరిసిల్ల ఘనకీర్తి మసకబారుతోంది. ప్రధాన రోడ్లు, కూడళ్లలో పారిశుధ్యం పడకేయడం అధికారుల పనితనాన్ని వెక్కిరిస్తుంది. పరిశుభ్రతలో ఆదర్శ విధానాలు అవలంబించిన సిరిసిల్ల బల్దియా తడబాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. అధికారులు ఇప్పటికై నా తేరుకుని అస్తవ్యస్తమైన పారిశుధ్య విధానాలను గాడిలో పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
స్వచ్ఛత.. ఇదేనా బాధ్యత
స్వచ్ఛతపై బల్దియా కొంతమేర బాధ్యతను విస్మరిస్తుంది. కొన్నేళ్ల పాటు జాతీయస్థాయిలో వందశాతం పారిశుధ్య అవార్డులు సాధించగా, కొద్దిరోజులుగా పట్టింపులేమిగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన కూడళ్లైన పాతబస్టాండు, చంద్రంపేట క్రాసింగ్ వద్ద రోడ్డుపై మురుగునీరు నిలవడం బల్దియా పనితీరుకు నిదర్శనంగా ఉంటోందని స్థానికులు విమర్శిస్తున్నారు. పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన నిషేధం అమలులో ఉన్నా డ్రైనేజీ వ్యవస్థలో లోటుపాట్లతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఇక విలీన గ్రామాలు చంద్రంపేట, రగుడు, రాజీవ్నగర్, పెద్దబోనాల, చిన్నబోనాల, పెద్దూరు, సర్దాపూర్లో డ్రైనేజీల్లేక ప్రజలు మురుగునీటిని దాటుతూ బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఏజెన్సీ ప్రాంతాలను మరిపించేలా విలీనగ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ ఉంటోంది.
డ్రైనేజీ వ్యవస్థలో లోటుపాట్లు
● పట్టణంలోని 39 వార్డుల్లో 277 మంది శానిటేషన్ సిబ్బంది, ప్రత్యేక అధికారులు పనిచేస్తున్నారు. ప్రత్యేక పాలనలో రోజూ అధికారుల వార్డుల సందర్శన అంతంతే ఉంటుందని ప్రజలు పేర్కొంటున్నారు.
● పాతబస్టాండు ప్రాంతంలోని ప్రధాన డ్రైనేజీ తరుచూ నిండి రోడ్డుపై మురుగు పరుగులు పెడుతోంది. ఇక్కడ సుమారు రూ.30లక్షలకు పైగా నిధులతో నిర్మించిన డ్రైనేజీలో పై ప్రాంతాల నుంచి వచ్చే నీరు సరిగా పారడం లేదన్న విమర్శలున్నాయి.
● పెద్దబజారు, బీవైనగర్, పద్మనగర్, అనంతనగర్, డాక్టర్స్స్ట్రీట్, రాళ్లబావి, శాంతినగర్, సాయినగర్, వెంకంపేట, తదితర ప్రాంతాల్లో డ్రైనేజీలకు మరమ్మతు చేయాల్సి ఉన్నా, అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
● విలీన గ్రామాల్లో సీసీ డ్రైనేజీల కోసం ప్రజలు ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నా పూర్తికావడం లేదు. వర్షాలు పడితే ఇళ్లలోకి, రోడ్లపైకి మురుగు పారుతూ ప్రజలు దుర్గంధంలో మగ్గుతున్నారు.
సిరిసిల్ల మున్సిపల్ ప్రొఫైల్
పట్టణ జనాభా 1,11,000
వార్డులు 39
శానిటేషన్ సిబ్బంది 277
డ్రైనేజీ 398.76 కి.మీ
వరదకాల్వలు 11 కి.మీ
కచ్చానాలాలు 123.44 కి.మీ
సీసీడ్రైన్స్ 264.32కి.మీ
‘ఇది సిరిసిల్ల–కరీంనగర్ ప్రధాన రహదారిలోని చంద్రంపేట క్రాసింగ్ రోడ్డు. ఇక్కడ డ్రైనేజీ కాల్వ దెబ్బతిని ఏళ్లు గడుస్తోంది. గతంలో పాలకులు తూతూమంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు అధికారులు ఇటువైపు కూడా చూడడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రధాన దారి వెంట మురికికూపం తయారవడం అధికారుల పనితనానికి ఇదో నిదర్శనం’.
‘ఈ కచ్చా కాల్వ పట్టణంలోని శ్రీనగర్కాలనీలోనిది. దీని నిండా
పిచ్చిమొక్కలు పెరిగి మురుగు నీరు నిలుస్తోంది. జనావాసాల మధ్య ఉన్న ఈ మురికికూపంతో దోమలు వృద్ధిచెంది ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. కాల్వలో కనీసం ఆయిల్బాల్స్ వేయడం, వార్డులో ఫాగింగ్ చేయడం లేదని
స్థానికులు చెబుతున్నారు’.
‘ఈ ఫొటోలో ఉన్నది కొత్తచెరువు సమీపంలోని మురుగునీటి కల్వర్టు. పూర్తిగా చెత్తతో నిండింది. డ్రైనేజీల్లో సిల్ట్ తీయడంలో బల్దియా నిర్లక్ష్యానికి ఇదో తార్కాణం. కల్వర్టు నుంచి దుర్గంధం వెలువడి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దోమలకు ఆవాసంగా మారిన ఈ డ్రైనేజీని శుభ్రం చేయకుండా నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి’.

మురుగుతున్న నిర్లక్ష్యం

మురుగుతున్న నిర్లక్ష్యం

మురుగుతున్న నిర్లక్ష్యం

మురుగుతున్న నిర్లక్ష్యం

మురుగుతున్న నిర్లక్ష్యం

మురుగుతున్న నిర్లక్ష్యం

మురుగుతున్న నిర్లక్ష్యం

మురుగుతున్న నిర్లక్ష్యం