
ముగ్గురు నిందితులు అరెస్ట్
బాలికపై లైంగిక దాడి కేసు..
● వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ
గిద్దలూరు రూరల్: సభ్య సమాజం తలదించుకునేలా 12 ఏళ్ల బాలికతో మద్యం తాగించి, ఆపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. మంగళవారం గిద్దలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ప్రధాన నిందితుడు చంద్రశేఖర్నాయుడు స్వగ్రామం కడప జిల్లా కలశపాడు మండలం చెన్నుపల్లె కాగా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద భోజనం హోటల్ నిర్వహిస్తున్నాడు. కలశపాడు మండలం మహానందిపల్లెకు చెందిన కేతుకుమారి భర్తతో మనస్పర్థలు వచ్చి దూరంగా ఉంటూ గిద్దలూరులోని ఓ హోటల్లో పనిచేసుకుంటోంది. ఈ నేపథ్యంలో కేతుకుమారికి చంద్రశేఖర్నాయుడితో పరిచయం ఏర్పడి అప్పడప్పుడూ అతడి హోటల్ వద్దకు వెళ్తుండేది. జూన్ 26వ తేదీన తనకు ఒక బాలిక కావాలని చంద్రశేఖర్నాయుడు కోరగా కుమారి గిద్దలూరులో నివాసం ఉంటున్న దూరపు బంధువు అయిన మహిళ వద్దకు బైక్పై వెళ్లారు. ఆమె కుమార్తెను తనతో బజారుకు పంపాలని చెప్పి, బైక్పై తాటిచర్ల మోటు వద్ద గల హోటల్కు తీసుకెళ్లారు. హోటల్లో పనిచేసే బాలుడు బీరు తీసుకొచ్చి కూల్డ్రింక్లో కలిపి బాలికతో తాగించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికపై చంద్రశేఖర్నాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన కుమార్తె ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో వెదుకులాడింది. మరుసటి రోజు తెల్లవారుజామున తాటిచెర్ల మోటు వద్దకు వెళ్లిన ఆమె తన కుమార్తె పరిస్థితిని చూసి చంద్రశేఖర్నాయుడు చొక్కా పట్టుకుని ఘర్షణ పడింది. తనకు రాజకీయపలుకుబడి ఉందని, ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని ప్రధాన నిందితుడు బెదిరించాడు. దీంతో బాలిక తల్లి జూన్ 27వ తేదిన కొమరోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన చంద్రశేఖర్నాయుడు, అతడికి సహకరించిన కుమారి, బాలుడుపై పోక్సో కేసు నమోదు చేశారు. కొమరోలులోని డ్రీమ్స్ రెస్టారెంట్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, కొమరోలు ఎస్సై నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.