
ఖైదీలతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ముఖాముఖి
ఒంగోలు: ఖైదీలతో స్థానిక జిల్లా జైలులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ బుధవారం ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ క్షణికావేశంలో తప్పులు చేసి కుటుంబాలకు దూరంగా ఉండడం, తద్వారా సమాజానికి భారంగా ఉండడం దురదృష్టకరమన్నారు. న్యాయవాదిని నియమించుకునే స్థోమతలేని ఖైదీలకు ఉచితంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ సిస్టం ద్వారా న్యాయ సహాయం అందిస్తారన్నారు. ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాల, స్టోర్ రూమును పరిశీలించి మరింత మెరుగైన వసతుల కోసం అవసరమైన సలహాలిచ్చారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ పి.వరుణ్రెడ్డి, వైద్యులు బ్రహ్మతేజ, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి.రవిశంకర్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వీర రాఘవులు, జైలర్ యలమందయ్య తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి హాకీ పోటీలకు
మైనంపాడు క్రీడాకారిణి
సంతనూతలపాడు: హాకీ ఇండియా ఆధ్వర్యంలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో నేటి నుంచి ఈనెల 12వ తేదీ వరకు జరగనున్న 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే హాకీ ఆంధ్రప్రదేశ్ జట్టుకు మండలంలోని మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆకుల లోహిత ఎంపికయ్యారని హెచ్ఎం డీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఎంపికై న క్రీడాకారిణిని జిల్లా అసోసియేషన్ సెక్రటరీ సుందరరామిరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో శర్మ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆకుల బ్రహ్మయ్య, పీఈటీ దాసరి శ్రీనివాసరావు, పీఈటీ తిరుమలశెట్టి రవికుమార్, స్కూలు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బైక్ ఢీకొని వృద్ధుడు మృతి
తర్లుపాడు: ఎదురెదురుగా వస్తున్న మోటారు సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన తర్లుపాడు మండలంలోని ఓబాయపల్లి కలుజువ్వలపాడు మధ్య బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కొండారెడ్డిపల్లికి చెందిన వెంకటస్వామి(65) అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న తర్లుపాడు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
5న జాతీయ లోక్ అదాలత్
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి
ఒంగోలు: ఈ నెల 5న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎ.భారతి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజీకి అర్హత కలిగిన క్రిమినల్, సివిల్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా పరిహారం చెల్లింపు కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వివాహ సంబంధ వ్యాజ్యాలను కక్షిదారుల ఆమోదంతో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. లోక్ అదాలత్లో పరిష్కరించుకున్న కేసుల్లో తీర్పు అంతిమమని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో పరిష్కరించుకున్న వ్యాజ్యాలకు సంబంధించి కోర్టుకు చెల్లించిన ఫీజును వాపసు పొందే అవకాశం ఉందని, ప్రీ సిట్టింగ్ రూపంలో ఇరువర్గాల ఆమోదంతో ముందస్తుగా వ్యాజ్యాల పరిష్కారానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ, సంబంధిత న్యాయవాదులు, మీడియేషన్ న్యాయవాదులు సహకరిస్తారన్నారు. ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారానికి సహకరించాలని పోలీసు, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోరారు.

ఖైదీలతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ముఖాముఖి

ఖైదీలతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ముఖాముఖి