
ఎయిడెడ్ విద్యార్థులకు వసతులు కల్పించాలి
ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 135 ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే వెంకట్రావు, సీహెచ్ ప్రభాకర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రతి తరగతికి చెందిన విద్యార్థులు కూర్చునేందుకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సమానంగా బెంచీలు, తరగతి గదులకు ఫ్యాన్లు, ఐఎఫ్ఎల్ ప్యానల్ టీవీలు, విద్యార్థులకు మంచినీటి వసతి కల్పించి ప్రభుత్వ విద్యార్థులకు ఇచ్చే ఆట వస్తువులు, పాఠశాల గ్రాంట్ విడుదల చేసి ఎయిడెడ్ పాఠశాలలకు పూర్వ వైభవం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
షూటింగ్ చాంపియన్షిప్లో జిల్లా విద్యార్ధుల ప్రతిభ
ఒంగోలు టౌన్: ఈ నెల 21వ తేదీ నుంచి 30 వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో జరుగుతున్న 25వ షూటింగ్ చాంపియన్షిప్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 9 మంది రైఫిల్, ఇద్దరు పిస్టల్ షూటింగ్ విభాగాల్లో విజయం సాధించారు. తదుపరి అహ్మదాబాద్, త్రివేండ్రంలలో ఆగస్టులో జరిగే సౌత్జోన్ ప్రీ నేషనల్స్కు అర్హత సాధించారు. షేక్ సదా ఫాతిమా, గంధం ఉషశ్రీ, రేష్మ, సాయి భ్రమర, కె.హనూష, లక్షణ్య, షేక్ అజ్మల్ హుసేన్, సిద్దా ఆదిత్య, నల్లూరి సాయి మనీష్, చక్కా శ్రీమంలుత్ రైఫిల్ విభాగంలో, సత్యేంద్ర పయ్యావుల, కోడూరి వెంకట సాయి పిస్టల్ విభాగంలో అర్హత సాధించారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్ లక్ష్యంగా షూటింగ్ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చిన స్కూలు యాజమాన్యానికి కోచ్, స్టేట్ రైఫిల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కమ్మ ఖాదర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా సర్పంచుల సంఘ కన్వీనర్గా రామారావు యాదవ్
ఒంగోలు సబర్బన్: జిల్లా సర్పంచుల సంఘ కన్వీనర్గా బట్టు రామారావు యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా సర్పంచుల సంఘం కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వీరభద్రాచారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న పది నెలల కాలంలో సర్పంచుల సమస్యలపై స్పందించి, వాటి పరిష్కారం దిశగా పని చేయాలని నూతన కన్వీనర్కు సూచించారు. ఈ సందర్భంగా నూతన కన్వీనర్ బట్టు రామారావు యాదవ్ మాట్లాడుతూ తనపై ఉంచిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు.
గ్రీన్ అంబాసిడర్ వేతనాలు
ప్రభుత్వమే భరించాలి:
గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించే గ్రీన్ అంబాసిడర్ వేతనాలు గతంలోలా ప్రభుత్వమే భరించాలని సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభద్రాచారి, నూతన కమిటీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు నూతన కమిటీ కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను మర్యాద పూర్వకంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిశారు. శానిటేషన్ పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల వేతనాల విషయంలో స్పందించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు లాజర్, ఎస్.మోహన్రెడ్డి, ప్రసాద్, పీ.మల్లీశ్వరి, పోశం సుమలత, సీహెచ్.విజయ, వీణ తదితరులు పాల్గొన్నారు.

ఎయిడెడ్ విద్యార్థులకు వసతులు కల్పించాలి