సాక్షి, అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై సీపీఐ నాయకుడు నారాయణ నిప్పులు చెరిగారు. డిప్యూటీ సీఎం పదవికి పవన్ కల్యాణ్ అనర్హుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణమే మంత్రివర్గం నుంచి పవన్ను బర్తరఫ్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.
ఇటీవలి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నాయకుడు నారాయణ తాజాగా స్పందించారు. ఈ సందర్బంగా నారాయణ..‘ఇటీవల కోనసీమ జిల్లా పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయి. ప్రజల ఐక్యతకు భంగం కలిగించేలా పవన్ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ, ప్రజల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుమార్తెను ఏపీలోని భీమవరానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించడమే ఇందుకు నిదర్శనం. ఇలాంటి సమయంలో పవన్ వ్యాఖ్యలు ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయి అని ఆరోపించారు.
ఇదే సమయంలో పవన్ కల్యాణ్ రాజకీయ వైఖరిపైనా నారాయణ విమర్శలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో పవన్ కల్యాణ్.. చేగువేరా తనకు ఆదర్శమని చెప్పారు. ఇప్పుడు సావర్కర్ను భుజానకెత్తుకుని ‘సనాతన ధర్మం’ అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు నిజంగా సనాతన ధర్మంపై ఆసక్తి ఉంటే, రాజకీయాలు వదిలిపెట్టి ఆ మార్గంలో వెళ్లవచ్చని సూచించారు. ‘దిష్టి తగిలింది’ వంటి మాటలు మాట్లాడే సనాతనవాదులకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు తగిన వ్యక్తి కాదు. ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలి అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.


