
కూటమి పాలనలో నమ్మక ద్రోహం
● ప్రజలకు ఇచ్చిన హామీలపై నిలదీసిన మాజీ ఎమ్మెల్యే కళావతి ● భామిని మండలంలో మాజీ ఎమ్మెల్యేకు ఘనస్వాగతం
బురుజోలలో మాజీ ఎమ్మెల్యే కళావతికి పూలవర్షంతో స్వాగతం పలుకుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు
భామిని:
ఏదో చేస్తాం. రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాం. అంటూ సూపర్ సిక్స్ పథకాలతో పాటు మరో 110 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిన టీడీపీ కూటమి మాయమాటలతో ఎన్నాళ్లు కాలం గడుపుతుందని పాలకొండ మాజీ శాసనసభ్యురాలు విశ్వాసరాయి కళావతి నిలదీశారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి తోట సింహాచలం, వైస్ఎంపీపీ భోనగడ్డి ధర్మారావులతో కలిసి భామిని మండలంలోని బురుజోల, కొత్తగూడ గ్రామాల్లో ఆమె గురువారం పర్యటించారు. ఆమెకు అడుగడుగునా పూలవర్షంతో అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం గ్రామాల్లోని సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా కళావతి మాట్లాడుతూ గ్రామీణ ప్రజల ఆకలి తీర్చే రేషన్ సరుకులు ఇంటింటికీ వెళ్లి అందించే వాహనాలను రద్దు చేసి ప్రజలకు కోటా కష్టాలు రుచి చూపిస్తున్నారని మండిపడ్డారు. ఎండీఎం వాహనాలను నిలిపివేసి డ్రైవర్లను నిరుద్యోగులను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్యను పెంచి ప్రజలను వేధిస్తున్నారన్నారు. కూటమి దుష్ట పాలనపై ప్రజలు విసిగిపోయారని, ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చి, గిరిజన ప్రజల సంక్షేమానికి కృషిచేయాలని డిమాండ్ చేశారు. కూటమి నాయకుల తీరు మార్చుకోకపోతే ప్రజలు తగిన గుణ పాఠం చెపుతారని హెచ్చరించారు. అనంతరం బిల్లుమడ, భామిని గ్రామాల్లో శుభకార్యాల్లో ఆమె పాల్గొన్నారు. ఆమెతో పాటు వైఎస్సార్సీపీ మండల నాయకుడు, సర్పంచ్ మడపాన కేశవ, మాజీ ఎంపీటీసీ పత్తిక సింహాచలం, గెల్లంకి రమేష్.బొడ్డేపల్లి ప్రసాద్, కాగితపల్లి కృష్ణ, పోతల మజ్జి, పారిశిల్లి గణపతి, ఆరిక సుక్కు, పతివాడ పగడాలమ్మ, బిడ్డిక సుబ్బారావు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

కూటమి పాలనలో నమ్మక ద్రోహం