
గ్రానైట్ లారీలు పట్టివేత
● బిల్లులు లేకుండా తరలింపు ● స్పెషల్ డ్రైవ్లో పట్టుబడ్డ గ్రానైట్ లారీలు ● కమర్షియల్ టాక్స్ అధికారుల మెరుపు దాడులు ● అదుపులోకి తీసుకున్న గ్రానైట్ లారీలు నడికుడి మార్కెట్ యార్డ్లో ● విలువను బట్టి పన్ను, జరిమానా వేస్తామన్న అధికారులు
పిడుగురాళ్ల: బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నాలుగు గ్రానైట్ లారీలను జీఎస్టీ, కమర్షియల్ టాక్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి లారీలను తనిఖీ చేసే కార్యక్రమం పట్టణంలోని బైపాస్ రోడ్డుపై నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొండమోడు నుంచి దాచేపల్లి వైపు వెళుతున్న నాలుగు గ్రానైట్ లోడ్ లారీలను గుర్తించి పట్టుకున్నారు. ఈ గ్రానైట్ లారీలకు సంబంధించి ఎటువంటి బిల్లు లేకపోవడం, సామర్థ్యాన్ని మించి లోడుతో రవాణా చేయటం నిర్వహించడంతో ఈ నాలుగు లారీలను అదుపులో తీసుకున్నారు. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వి.భార్గవ్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీలు చేపట్టామని అందులో నాలుగు గ్రానైట్ లారీలు బిల్లులు లేకుండా రవాణా చేస్తున్నాయని వాటిని గుర్తించామన్నారు. వీటిని అదుపులో తీసుకొని నడికుడి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఉంచినట్లు తెలిపారు. గ్రానైట్ లోడును బట్టి, గ్రానైట్ విలువను అంచనా వేసి ఆ తరువాత పన్నుతోపాటు అపరాధ రుసుం కూడా విధిస్తామని చెప్పారు. అలాగే లెక్కలు చూసి టాక్స్, ఫైన్ వేయాల్సి ఉంటుందని దానికి కొంత సమయం పడుతుందని వివరించారు. బిల్లులు లేకుండా ఓవర్ లోడ్ తో గ్రానైట్ లారీలు వెళితే అటువంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. అక్రమంగా బిల్లులు లేకుండా గ్రానైట్ లారీలు తరలిస్తే వాటిని అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ దాడుల్లో జీఎస్టి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఎం రవికుమార్, జీఎస్టీవో టి పీటర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.