
కూటమి సవతి తల్లి ప్రేమ
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) పద్ధతిపై పని చేస్తున్న ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. బదిలీల్లో అన్యాయాన్ని నిలదీస్తూ ఆదివారం గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 57 మండలాల్లో 339 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. బదిలీల్లో భాగంగా కౌన్సెలింగ్ నిమిత్తం వీరిని ఆదివారం గుంటూరులోని డీఈవో కార్యాలయానికి రావాల్సిందిగా విద్యాశాఖాధికారులు సమాచారం పంపారు. అయితే, ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీల కారణంగా పల్నాడు జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో పోస్టులు ఖాళీ అయ్యాయి. ఎంటీఎస్ ఉపాధ్యాయులను ఆయా మండలాలకు పంపేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో గుంటూరులోని డీఈవో కార్యాలయంలో డీఈవో సీవీ రేణుక అధ్యక్షతన కౌన్సెలింగ్కు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో పని చేస్తున్న 1998, 2008 డీఎస్సీల క్వాలిఫైడ్స్ ఎంటీఎస్ ఉపాధ్యాయులు కార్యాలయానికి వచ్చారు. ఉన్నతాధికారుల అన్యాయాన్ని ఎండగడుతూ కౌన్సెలింగ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి, ఆందోళనకు దిగారు.
మానవత్వంతో ఉద్యోగాలు ఇచ్చిన జగన్
1998, 2008 డీఎస్సీల ద్వారా ఎంపికై న క్వాలిఫైడ్స్ అభ్యర్థులకు అప్పటి ప్రభుత్వాలు ఉపాధ్యాయులుగా నియామకాలు కల్పించలేదు. తమకు న్యాయం చేయాలని ఏళ్ల తరబడి ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేశారు. రాష్టవ్యాప్తంగా ఆందోళనలు సైతం నిర్వహించారు. ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో నెలకు రూ.30వేల వేతనంతో ఎంటీఎస్ పద్ధతిపై ఉపాధ్యాయులుగా పోస్టింగ్స్ ఇచ్చారు.
అధికారుల వైఖరికిపై తీవ్ర నిరసన
తాజాగా ఉపాధ్యాయ బదిలీలతో పల్నాడు జిల్లాలోని మారుమూల మండలాల్లో పాఠశాలలు ఖాళీ అయ్యాయి. అక్కడకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 57 మండలాల్లో పని చేస్తున్న ఎంటీ ఎస్లను పంపాలని తీసుకున్న నిర్ణయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియామక సమయంలో వారికి సొంత మండలంలోనే పని చేసేందుకు వెసులుబాటు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి విరుద్ధంగా ఒక్కో ఉపాధ్యాయుడిని 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలకు బదిలీపై పంపాలనే అధికారుల వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికీ 50 ఏళ్ల వయసులో ఉద్యోగం వచ్చిందని, కేవలం రూ.30వేల వేతనంతో ఇళ్లు, పిల్లలను వదిలి దూర ప్రాంతంలోని పాఠశాలకు వెళ్లి, ఏ విధంగా పని చేయాలనే ఆవేదనతో కౌన్సెలింగ్ను బహిష్కరించారు.
ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు
ఎంటీఎస్ ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో దిగొచ్చిన విద్యాశాఖాధికారులు ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో బ్లాక్ చేసిన ఖాళీలను ఓపెన్ చేశారు. 339 మంది ఉపాధ్యాయులకు 620 ఖాళీలను ప్రదర్శించి, కౌన్సెలింగ్ ప్రారంభించారు.
పల్నాడు జిల్లాలో ఖాళీగా ఉన్న
పాఠశాలలకు పంపేందుకు
విద్యాశాఖ ప్రయత్నం
డీఈవో కార్యాలయంలో
బదిలీల కౌన్సెలింగ్ బాయ్కాట్
సొంత మండలాల్లోనే పోస్టింగ్
ఇవ్వాలని డిమాండ్
1998, 2008 డీఎస్సీ క్వాలిఫైడ్స్కు ఎంటీఎస్ ప్రాతిపదికన నియామకాలు కల్పించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
ఉమ్మడి గుంటూరు జిల్లాలో
339 మంది టీచర్లు