
పసుపు సాగులో కొత్త పుంతలు
డొంకేశ్వర్(ఆర్మూర్): యాంత్రీకరణను రైతులు అందిపుచ్చుకుంటున్నారు. కూలీలు లేకుండానే భూమిని దున్ని పసుపు విత్తనాలతోపాటు ఎరువు లు కూడా వేసే పసుపు సీడర్ (యంత్రం) అందుబాటులోకి వచ్చినట్లు తెలుసుకుని డొంకేశ్వర్కు చెందిన బార్ల బొర్రన్న కొనుగోలు చేశాడు. రూ.1.45లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రంతో తనకున్న ఆరు ఎకరాల్లో సీడర్తోనే పసుపు విత్తనాలు విత్తాడు. సాధారణంగా నలుగురు కూలీలు రోజంతా రెండు ఎకరాలు విత్తనాలు వేస్తే.. ఈ యంత్రం మాత్రం కేవలం రెండున్నర గంటల్లోనే దున్నడం, విత్తనం వేయడం పూర్తి చేస్తుందని రైతు తెలిపాడు. గతేడాది కూలీల తో విత్తనాలు వేయిస్తే ఎకరానికి 25 బస్తాలు అయ్యేవని, ఇప్పుడు 16 బస్తాలే సరిపోయినట్లు చెప్పాడు. డబ్బుతోపాటు విత్తనం ఆదా అయ్యిందని సంతోషం వ్యక్తం చేశాడు.