
మళ్లీ ‘లంపీ స్కిన్’ కలకలం
డొంకేశ్వర్(ఆర్మూర్) : రెండేళ్ల క్రితం జిల్లాలో కనిపించిన ‘లంపీ స్కిన్’ వైరస్ మళ్లీ తెల్ల జాతి పశువుల్లో కనిపిస్తోంది. వేగంగా వ్యాపించే ఈ వైరస్ లక్షణాలు (దద్దుర్లు) పశువుల్లో బయటపడడంతో పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. డిచ్పల్లి, నందిపేట్ మండలాల్లో లేగ దూడలు ఈ వైరస్ బారిన పడినట్లు అధికారులు గుర్తించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల్లోని పశువులకు ఎల్ఎస్డీ వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించారు. ఇప్పటికే 10 వేల పశువులకు వ్యాక్సిన్ వేయగా ఇంకా 60 వేల వరకు డోసులు అందుబాటులో ఉంచినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జగన్నాథచారి తెలిపారు. పాడి రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వైరస్ లక్షణాలు కనిపిస్తే పశువైద్య అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. మిగతా మండలాలకు కూడా వైరస్ విస్తరించకుండా పశువైద్య సిబ్బంది ద్వారా గ్రామాల్లోని రైతులకు పలు జాగ్రత్త చర్యలు సూచిస్తున్నామన్నారు.
లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● ఆవులు, తెల్లజాతి పశువులకే ‘లంపీ స్కిన్’ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
● మొదట తీవ్రమైన జ్వరం కనిపిస్తుంది.
● మేత సక్రమంగా తినకపోవడం, పాలు తక్కువ ఇవ్వడం
● పశువు శరీరంలో మార్పులు జరిగి దద్దుర్లు రావడం
● సంబంధిత పశువుని మందలోకి వదలకుండా ప్రత్యేకంగా ఉంచాలి
● చికిత్స తర్వాత మేత పుష్టిగా అందించాలి, లేదా గంజి తాగించాలి.
తెల్లజాతి పశువులకు విస్తరిస్తున్న వైరస్
అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ