
చేప పిల్లలు.. ఆలస్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో చేప పిల్లల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి లక్ష్యం నిర్దేశించలేదు. లెక్కప్రకారం ప్రతి ఏడాది మే నెలలోనే ఏఏ చెరువులకు, ఎన్ని చేప పిల్లలు పంపిణీ చేయాలో లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్లాల్సి ఉంది. అయితే గత ఏడాది నుంచి ఈ ప్రక్రియ అమలులో ఆలస్యం చేస్తున్నారు. దీంతో మత్స్యకారులు నష్టపోతున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 967 చెరువుల్లో 4.54 కోట్ల చేప పిల్లలు పోసేందుకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం అందుకు అనుగుణంగా ఇప్పటి వరకు సర్క్యులర్ రాలేదు. వాస్తవానికి ఎండలు బాగా ఉన్న మే నెలలోనే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సింది. ఈసారి వర్షాలు ముందస్తుగా వచ్చాయి. అయినప్పటికీ చేప పిల్లల పంపిణీ లక్ష్యం నిర్దేశించుకోకపోవడం, ఆ దిశగా కసరత్తు చేయకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. మత్స్యకారులు అందోళన చెందుతున్నారు. అసలు ఈ ఏడాది చేప పిల్లల టెండర్లు నిర్వహించే ప్రక్రియ ఊసే లేదు. అదును దాటితే చేప పిల్లలు సక్రమంగా సైజ్ పెరగవని మత్స్యకారులు చెబుతున్నారు.
● గత ఏడాది కూడా చేప పిల్లల పంపిణీలో తాత్సా రం చేయడంతో లక్ష్యం సగం కంటే కూడా తక్కువ కు కుదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత సంవత్స రం 967 చెరువుల్లో 4.45 కోట్ల చేప పిల్లలను వదలాలని లక్ష్యం నిర్దేఽశించుకున్నప్పటికీ చాలా దూరంలో నిలవడం గమనార్హం. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చేప పిల్లల లక్ష్యాన్ని భారీగా తగ్గించారు.
● 967 చెరువుల్లో 4.45 కోట్ల పిల్లలను పోయాల్సి ఉండగా కేవలం 799 చెరువుల్లో 1.92 కోట్ల చేప పిల్లలను మాత్రమే పోశారు. వీటి విలువ రూ.2.13 కోట్లు. ఆయా చెరువుల్లో 35 నుంచి 40 మిల్లీమీటర్లు, 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజులో ఉన్న బొచ్చ, రోహూ, మీరగం చేప పిల్లలను పోశారు. ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ టెండర్ల ఊసే లేకపోవడం పట్ల మత్స్యకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ విషయమై ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయస్వామి ‘సాక్షి’కి తెలిపారు. ఈ వారంలో ఆదేశాలు వచ్చే అవకాశముందన్నారు.
త్వరగా పంపిణీ చేయాలి
పోయినేడాది చేప పిల్లలను ఆలస్యంగా చెరువుల్లో పోశా రు. ఈసారి ప్రభుత్వం తొందరగా టెండర్లు పూర్తిచేసి జూలై మొదటి వారంలో పంపిణీ జరిగేలా చర్యలు తీ సుకోవాలి. నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేస్తే అవి సక్రమంగా పెరిగి మత్స్యకారులకు మంచి ఉపాధి లభిస్తుంది. – మోహన్,
మత్స్యకారుడు, డొంకేశ్వర్
పంపిణీకి కసరత్తు మొదలు పెట్టని
రాష్ట్ర ప్రభుత్వం
టెండర్ల ప్రక్రియ ఊసే లేకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన
గత ఏడాది ఆలస్యంతో సగానికి పైగా లక్ష్యం కుదించిన వైనం

చేప పిల్లలు.. ఆలస్యం