
నవోదయలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
నిజామాబాద్ అర్బన్: జిల్లాకు కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఏడాది నుంచే తరగతులను నిర్వహించనున్న దృష్ట్యా మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని నాగారంలో ఉన్న జిల్లా విద్యాశిక్షణ సంస్థ (డైట్) కళాశాల ఆవరణలోని భవన సముదాయాలలో తాత్కాలికంగా జవహర్ నవోదయ విద్యాలయాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ శుక్రవారం డైట్ కాలేజీ భవనాన్ని సందర్శించి, తరగతుల నిర్వహణకు అనువైన పరిస్థితులు, అందుబాటులో ఉన్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాలు చేపట్టి తరగతులను నిర్వహిస్తామని, రెండు సెక్షన్లలో 80 మంది విద్యార్థినీవిద్యార్థులు ప్రవేశం పొందుతారని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతోపాటు అధ్యాపకులు, సిబ్బందికి తగిన వసతి, బోధన తరగతుల నిర్వహణ వంటి వాటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. తరగతి గదులు, డార్మెటరీ, డైనింగ్ హాల్, లైబ్రరీ, బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు, స్టాఫ్ క్వార్టర్స్ కోసం ఎంపిక చేసిన గదులను కలెక్టర్ పరిశీలించారు. తాత్కాలిక భవనాలలో కొనసాగుతున్న మరమ్మతు పనులను శరవేగంగా జరిపించాలని, నూతన విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే నాటికి పనులను పూర్తి చేయించాలని సూచించారు. శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చే వరకు జవహర్ నవోదయ విద్యాలయం డైట్ కళాశాల ప్రాంగణంలోని భవన సముదాయాల్లోనే కొనసాగనున్న దృష్ట్యా మరమ్మతు పనులు పక్కాగా జరిపించి అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఈవో పీ అశోక్, జవహర్ నవోదయ విద్యాలయం ఇన్చార్జి ప్రిన్సిపాల్ యోహన్నన్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ తదితరులున్నారు.
తాత్కాలిక భవన మరమ్మతులను
వేగంగా చేపట్టాలి
శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చే వరకు డైట్ భవనంలోనే కొనసాగింపు
అధికారులకు కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ఆదేశం