
అర్హులకు న్యాయం జరిగేలా చూడాలి
బోధన్/ రుద్రూర్ : భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు వేదికగా నిలవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. అర్హులైన దరఖాస్తుదారులకు పూర్తి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పనిచేయాలని అప్పుడే సదస్సుల నిర్వహణకు సార్థకత చేకూరుతుందన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూ భారతి (ఆర్వోఆర్) చట్టం అమలు చేస్తోందన్నారు. సాలూర మండల కేంద్రంతోపాటు రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్లో దరఖాస్తుదారుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆన్లైన్లో వివరాల నమోదులో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సదస్సులో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించి రసీదును అందజేయాలని సూచించారు. సానుకూలంగా ఉన్న సమస్యలు సాధ్యమైనంత వరకు అక్కడిక్కడే పరిష్కరించాలని పేర్కొన్నారు. దరఖాస్తుదారులను పదే పదే తిప్పుకోకూడదని రెవెన్యూ బృందాలకు సూచించారు. సమస్యల వారీగా దరఖాస్తులను విభజిస్తూ, పక్కాగా రికార్డులను పొందుపర్చాలన్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు.
భూ సమస్యలున్న ప్రజలు సదస్సులకు హాజరై దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శశిభూషణ్, తారాబాయి తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆన్లైన్ ఎంట్రీలో తప్పిదాలు ఉండొద్దు
భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలవాలి
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
సాలూర, రుద్రూర్ మండలాల్లో
సదస్సుల పరిశీలన

అర్హులకు న్యాయం జరిగేలా చూడాలి