
నవోదయలో ఈ ఏడాది నుంచే తరగతులు
నిజామాబాద్అర్బన్ : జిల్లాలకు కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రస్తుత (2025–26) విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా సూచించారు. పాఠశాల విద్యా శాఖ సంచాలకులు నర్సింహారెడ్డితో కలిసి గురువారం ఆమె ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్ష జరిపారు. యోగితారాణా మాట్లాడుతూ, జవహర్ నవోదయ విద్యాలయాలకు శాశ్వత ప్రాతిపదికన భవన నిర్మాణాల కోసం అనుకూలమైన స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్లకు సూచించారు. ఇప్పటికే స్థల నిర్ధారణ పూర్తయిన జిల్లాలలో నవోదయ విద్యాలయాల భవన నిర్మాణాలకు చొరవ చూపాలన్నారు. శాశ్వత భవనాలు సమకూరే వరకు అందుబాటులో ఉన్న తాత్కాలిక భవనాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు నిర్వహించాలన్నారు. తరగతి గదులు, నీటి వసతి, టాయిలెట్స్ వంటి కనీస సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. చిన్నచిన్న మరమ్మతులు, ఫర్నీచర్ వంటి వాటి కోసం ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్న్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా విద్యా శాఖ అధికారి పి అశోక్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా