
అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి మండలం గర్గుల్లో ఆదివారం చోటు చేసుకుంది. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుంటికాడి నర్సింలు(45) ఆటో నడిపిస్తూ జీవనం సాగించేవాడు. అతనికి ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం కుమార్తెకు వివాహం చేయగా అప్పులయ్యాయి. దీనికి తోడు ఆటో సరిగ్గా నడవక ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మానసికంగా కుంగిపోయేవాడు. శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం నిర్మాణంలో ఉన్న గంగపుత్ర సంఘం భవనం వద్ద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి రెండో భార్య వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.