
వార్షిక ప్రణాళికలను రూపొందించండి
నంద్యాల(న్యూటౌన్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అన్ని శాఖలు వార్షిక ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రణాళికల రూపకల్పనపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 ఎకరాల్లో సాగవుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని అదనంగా మరో 25 ఎకరాలకు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని చేపట్టేందుకు ఇదివరకే 40 డ్రోన్స్ వినియోగించారని, మరో 40 డ్రోన్ల వినియోగానికి చర్యలు చేపట్టాలన్నారు. మత్స్య శాఖకు సంబంధించి 63వేల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తితో పాటు సీడ్ ఉత్పత్తిపై దృష్టి సారించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి ఎంఎస్ఎంఈ పార్క్లు ఏర్పాటు చేయాలన్నారు. ఏపీ టూరిజం స్టార్ హోటల్ నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం కేటాయించామని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సీపీఓ వేణుగోపాల్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సైనికులకు జోహార్లు
కర్నూలు(సెంట్రల్): ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులు తోక జాడించారని, భవిష్యత్లో టెర్రరిస్టులు భారత్ వైపు చూడాలంటే భయపడేలా చేసిన సైనికులకు జోహార్లు అని మాజీ సైనికుల జిల్లా అధ్యక్షుడు నర్రా పేరయ్య చౌదరి అన్నారు. శుక్రవారం జిల్లా మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో రాజ్విహార్ నుంచి కలెక్టరేట్ వరకు జై భరత్ మాతాకి జై అంటూ వందలాది మంది మాజీ సైనికులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆపరేషన్ సింధూర్తో భారత్ సైనిక బలమేమిటో ప్రపంచానికి తెలిసిందన్నారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలుకోల్పోయిన సైనికులకు నివాళులు అర్పించారు. రూటు, గడ్డం రామకృష్ణ, కె.రాముడు, మనోహర్రాజు, మున్నీర్, రవీంద్ర, సూర్య నారాయణ పాల్గొన్నారు.
75శాతం సబ్సిడీపై
పశుగ్రాసం విత్తనాలు
కర్నూలు(అగ్రికల్చర్): పశుగ్రాసం విత్తనాలు 75 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. జిల్లాకు పశుగ్రాసాల సాగుకు జొన్న విత్తనాలు 9 టన్నులు కేటాయించినట్లు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 5 కిలోల బ్యాగుల్లో లభిస్తాయని, పూర్తి ధర రూ.460 ఉండగా.. సబ్సిడీ రూ.345 ఉంటుందని, రైతులు రూ.115 చెల్లించాలని సూచించారు. ఏకవార్షిక రకానికి చెందిన జొన్న విత్తనాల కోసం రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలన్నారు.
● అదేవిధంగా జిల్లాకు సమీకృత దాణా కూడా కేటాయించారన్నారు. 50 కిలోల బస్తా ధర రూ.1,110 ఉండగా.. 50 శాతం సబ్సిడీ రూ.555 పోను రైతులు రూ.555 చెల్లించాలన్నారు.

వార్షిక ప్రణాళికలను రూపొందించండి