
బాబు మాట.. నీటి మూట!
హామీ ఇవ్వడం అధికారంలోకి వచ్చాక దానిని మరచిపోవడం సీఎం చంద్రబాబుకు అలవాటేనని పలువురు ఆరోపిస్తున్నారు. శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలే ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. శ్రీశైలం నీటిముంపు నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తానని 2003, 2016, 2019, 2024లో టీడీపీ అధినేత మాట ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. నాలుగు సార్లు హామీలు ఇచ్చినా.. ఇప్పటి వరకు ఉద్యోగాలు రాలేదని నీటిముంపు బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
నందికొట్కూరు: శ్రీశైలం వద్ద కృష్ణానదిపై జలాశయం నిర్మాణానికి 1963లో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కింద సుమారు 12 వేల కుటుంబాలు సర్వం కోల్పోయాయి. మొత్తం 66 గ్రామాల్లో లక్ష ఎకరాల భూమి ముంపునకు గురైంది. 44 రెవెన్యూ గ్రామాలు, 22 మజరా గ్రామాలకు చెందిన ప్రజలు నిర్వాసితులయ్యారు. వీరు నాలుగు దశాబ్దాలుగా ఉద్యోగం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. వీరి సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టుతో ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు కలుగుతోంది. నిర్వాసితులు మాత్రం న్యాయం కోసం నేటికీ పోరాడాల్సి వస్తోంది.
ఏం జరిగిందంటే..
శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం 1982లో ఉద్యమ బాటపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు.. శ్రీశైలం ముంపు బాధిత ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా 1986లో జీఓ 98 జారీ అయ్యింది. దీంతో అప్పట్లో 1,200 మంది ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన జీవోను టీడీపీ అధినేత చంద్రబాబు తుంగలో తొక్కేశారు. ఉద్యోగాలు ఇస్తామని పలుమార్లు హామీ ఇచ్చినా అమలు చేయలేదు.
న్యాయం కోసం ఎదరు చూపు
శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు మొదటి జాబితాలో 965 మందిని అర్హులుగా ప్రకటించారు. 2012లో కేవలం 120 మందికి మాత్రమే తాత్కాలిక పద్ధతిలో లష్కర్ ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్న సయమంలో రెండో జాబితాను తయారు చేయించినా ఉద్యోగాలు ఇవ్వలేదు. దీంతో నీటిముంపు నిరుద్యోగులు మళ్లీ పోరాటం కొనసాగించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూనే ఇప్పటికీ చాలా మంది పెళ్లిళ్లు కూడా చేసుకోలేదు. కొందరు ఆనార్యోగాల కారణంగా మృతి చెందారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చి 45 సంవత్సరాలు అవుతున్నా నిర్వాసితులకు ఉద్యోగం కలగానే మిగిలింది. ధర్నాలు, దీక్షలు చేసి నిర్వాసితులు అలసిపోయారు. న్యాయం చేయాలని కోరుతున్నారు.
హామీని ఇలా ‘నీరు’గార్చారు..
● శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని 2003లో సీఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో హామీ ఇచ్చారు.
● సీఎం హోదాలో 2016లో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద జలహారతి కార్యక్రమంలో ఇదే హామీ ఇచ్చారు.
● సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019లో నందికొట్కూరుకు వచ్చి నీటిముంపు నిరుద్యోగులకు న్యాయం చేస్తామని వాగ్దానం చేశారు.
● 2024లో జరిగిన ఎన్నికల్లో నందికొట్కూరు పటేల్ సెంటర్లో టీడీపీ అధినేతగా చంద్రబాబు ప్రసంగించారు. శ్రీశైలం నిర్వాసితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఇచ్చిన హామీని అమలు చేయలేదు.
● నిర్వాసితులు గత ఏడాది ఆక్టోబర్ 28న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వినతి పత్రం అందజేశారు. ఆరు నెలల దాటినా డిప్యూటీ సీఎం సమస్యకు మార్గం చూపించలేదు.
అమలు కాని సీఎం చంద్రబాబు హామీ
న్యాయం చేయాలంటున్న శ్రీశైలం
నీటిముంపు నిరుద్యోగులు
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో
ముంపునకు గురైన 66 గ్రామాలు
అప్పట్లో భూములు కోల్పోయిన
12 వేల కుటుంబాలు

బాబు మాట.. నీటి మూట!