ఇంటర్ పరీక్షల్లో 30 మంది డిబార్
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో సోమవారం ఒకే రోజు 30 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. 123 కేంద్రాల్లో నిర్వహించిన సెకండ్ ఇయర్ పరీక్షలకు 34,463 మంది విద్యార్థులకుగాను 33,156 మంది హాజరయ్యారు. 1,307 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆస్పరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆరుగురు, ఆలూరు జూనియర్ కాలేజీలో ఇద్దరు, కోవెలకుంట్లఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో నలుగురు, డోన్ ఏపీ మోడల్ స్కూల్లో ఆరుగురు, బేతంచెర్ల ఏపీ మోడల్ స్కూల్లో ఆరుగురు, కృష్ణగిరి ఏపీ మోడల్ స్కూల్లో ముగ్గురు, బేతంచర్ల పాణ్యం సిమెంట్స్ జూనియర్ కాలేజీలో ముగ్గురు కాపీయింగ్ పాల్పడుతుండగా స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించి డిబార్ చేసినట్లు ఆర్ఐఓ గురవయ్యశెట్టి తెలిపారు.
డిగ్రీ పరీక్షల్లో 19 మంది..
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో సోమవారం నిర్వహించిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో 19 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. 68 కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలకు ఉదయం 4,976 మందికిగాను 4,582 మంది, మధ్యాహ్నం 12,236 మందికిగాను 11,066 మంది విద్యార్థులు హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు.