
అందగత్తెలకు ఆతిథ్యం
పోచంపల్లికి 25 మంది అందాలభామలు
ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచి, యునెస్కో అనుబంధ సంస్థచే ఉత్తమ పర్యాటక గ్రామంగా అంతర్జాతీయ అవార్డు అందుకున్న భూదాన్పోచంపల్లిని గురువారం సాయంత్రం 6 గంటలకు 25 మంది సుందరీమణులు సందర్శిస్తారు. టూరిజం పార్కులోని మ్యూజియంలో దారం నుంచి చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. వీరికి సింగిల్ ఇక్కత్, డబుల్ ఇక్కత్, తేలియా రుమాలు, చేనేత వస్త్రాల ప్రాముఖ్యతను వివరిస్తారు. అలాగే హాంఫి థియేటర్లో ప్రముఖ మోడల్స్చే నిర్వహించే ర్యాంప్ వాక్ను తిలకిస్తారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్వాతి రూపొందించిన ఇండోవెస్ట్రన్ ఇక్కత్ వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ కొనసాగనుంది. చేనేత ప్రాముఖ్యతను సుందరీమణులకు ప్రత్యేక యాంకర్స్ ద్వారా వివరిస్తారు. అలాగే పద్మశ్రీ గజం గోవర్ధన్, జాతీయ అవార్డు గ్రహీతలైన తడక రమేశ్, సాయిని భరత్, రాష్ట్ర అవార్డు గ్రహీతలు బోగ బాలయ్య, ఎన్నం మాధవి శివకుమార్, చేనేత సహకార సంఘం, పోచంపల్లి టై అండ్ డై అసోషియేషన్ల ఆధ్వర్యంలో పది స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పలు రకాల చేనేత వస్త్రాలను ప్రదర్శించనున్నారు.
నేడు పోచంపల్లి, యాదగిరిగుట్టలో మిస్వరల్డ్ పోటీదారుల పర్యటన
సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట, భూదాన్పోచంపల్లి : మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. యాదగిరిగుట్ట క్షేత్రాని ఓ బృందం, భూదాన్పోచంపల్లిలో మరో బృందం సందడి చేయనుంది. వీరి పర్యటన కోసం టూరిజం శాఖతోపాటు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
నారసింహుడి క్షేత్రంలో ప్రత్యేక పూజలు
పది మంది సుందరీమణుల బృందం గురువారం సాయంత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి రానుంది. వీరు ప్రత్యేక బస్సులో హైదరాబాద్ నుంచి యాదగిరి కొండపైకి చేరుకుంటారు. కొండపైన అతిథి గృహం నుంచి ప్రత్యేక బ్యాటరీ వాహనాల్లో అఖండ దీపారాధన వద్దకు చేరుకుని దీపాలు వెలిగిస్తారు. అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సువర్ణ పుష్పార్చనలో పాల్గొంటారు. వేద పండితులు సుందరీమణులకు ఆశీర్వచనం చేసి, శ్రీస్వామి వారి చిత్రపటాలు, లడ్డూ ప్రసాదాలను అందజేస్తారు. దర్శనం తర్వాత ముఖ మండపంలో పలు ప్రాంతాలను వీక్షిస్తారు. అనంతరం స్వర్ణ విమాన గోపురం వద్ద ఆలయమంతా కనిపించేలా ఫొటోలు దిగుతారు. సుందరీమణులు యాదగిరి క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో ప్రధానాలయ ముఖ మండపం, మహా రాజగోపురాలను అలంకరించారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం భక్తులకు కల్పించే బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. దీంతో పాటు జోడు సేవలను రద్దు చేశారు. సుందరీమణులు వెళ్లిన తరువాత భక్తులకు శ్రీస్వామి వారి దర్శనాలను కొనసాగిస్తారు.
ఫ శ్రీలక్ష్మీనరసింహస్వామిని
దర్శించుకోనున్న సుందరీమణులు
ఫ టూరిజం పార్కులో చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియల పరిశీలన

అందగత్తెలకు ఆతిథ్యం