మహిళను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

పోలుమల్ల శివారులో బోల్తాపడిన లారీ  - Sakshi

కోదాడరూరల్‌: మహిళను లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు కోదాడ రూరల్‌ ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండల పరిధిలోని రెడ్లకుంట గ్రామానికి చెందిన మహిళను అదే గ్రామానికి చెందిన చిరంజీవి లైంగికంగా వేధిస్తుండటంతో సోమవారం అర్థరాత్రి ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. సదరు మహిళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిరంజీవిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

అదుపుతప్పి లారీ బోల్తా

మద్దిరాల: కట్టెల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడిన సంఘటన మండల పరిధిలోని పోలుమల్ల శివారులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ నుంచి వరంగల్‌ వైపునకు కట్టెల లోడుతో వెళ్తున్న లారీ పోలుమల్ల శివారుకి చేరుకోగానే అదుపుతప్పి 365వ నంబర్‌ జాతీయ రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు.

అంబులెన్స్‌కు మంటలు

మిర్యాలగూడ అర్బన్‌: చెత్త కుప్పకు నిప్పుపెట్టడంతో పక్కనే నిలిపి ఉంచిన అంబులెన్స్‌ స్వల్పంగా దగ్ధమైన సంఘటన మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. మిర్యాలగూడ పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపు మినీ రవీంద్రభారతి ఎదురుగా చెత్తకుప్పలకు గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం సాయంత్రం నిప్పుపెట్టగా పక్కనే నిలిపి ఉంచిన అంబులెన్స్‌ టైర్లు, వెనక భాగం కాలిపోయింది. స్థానికులు గుర్తించి అగ్నిమాపక అధికారులకు సమాచారం అందిచటంతో వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. దీంతో పక్కన మరి కొన్ని అంబులెన్స్‌లకు పెను ప్రమాదం తప్పింది.

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top