
రోగులకు అందుబాటులో మెరుగైన వైద్యం
లింగాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అదనపు వైద్యాధికారి తారాసింగ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం జిల్లా అదనపు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఆస్పత్రి తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోకి చేరడంతో త్వరలో అన్ని రకాల పోస్టులు భర్తీ అవుతాయన్నారు. దీంతో రోగులకు 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. త్వరలో సాధారణ కాన్పులు చేయడంతో పాటు ఆపరేషన్ థియేటర్ను కూడా ప్రారంభిస్తామన్నారు. మృతదేహాలకు ఇక్కడే పోస్టుమార్టం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రోగులు రూ.వేలు ఖర్చు పెట్టి ఆస్పత్రులకు వెళ్లొద్దని, సర్కార్ దవాఖానాలోనే అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
రేపు రెడ్క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం
నాగర్కర్నూల్ క్రైం: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 27న జిల్లా కేంద్రంలోని ఎస్జేఆర్ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా రెడ్క్రాస్ కార్యదర్శి రమేష్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా రెడ్క్రాస్ సొసైటీలో శాశ్వత సభ్యత్వం కలిగిన సభ్యులతో పాటు ప్యాట్రన్, వైస్ ప్యాట్రన్ సభ్యత్వం కలిగిన వారు సమావేశానికి హాజరు కావాలని కోరారు. రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ కలెక్టర్ సూచనలతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు.
రేపు పాలెంలో పాలిసెట్ కౌన్సెలింగ్
బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (ఏ)లో శుక్రవారం నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.రాములు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు నిర్వహించే పాలిసెట్ కౌన్సెలింగ్కు వచ్చే విద్యార్థులు తమ వెంట ఒరిజినల్ టీసీ, పది, సమాన తరగతుల మెమోలు, బోనఫైడ్లు, ఆదాయం సర్టిఫికెట్, స్థానిక ధ్రువీకరణపత్రం ఆధార్కార్డు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటో తీసుకొని రావాలని సూచించారు. స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 27, 28, 29 తేదీల్లో హాజరు కావాలన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: సాహస రంగంలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించడానికి యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ టెంజింగ్ నార్వే నేషనల్ అడ్వెంజర్ అవార్డు–2024 ఎంపికకు http://awards. gov.in అనే వెబ్సైట్ ద్వారా జిల్లాలోని యువత దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల అధికారి సీతారాం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవార్డులు భూమిపై సాహసయాత్రలు, సముద్రంలో, ఆకాశంలో చేసే సాహస యాత్రలకు ఈ అవార్డు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
37 వాహనాలకు వేలం
తెలకపల్లి: మండల కేంద్రంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో గురువారం ఉదయం 11గంటలకు వివిధ కేసుల్లో పట్టుబడిన 37 వాహనాలకు సంబంధించిన వేలం నిర్వహిస్తున్నట్లు ఎకై ్సజ్ ఎస్ఐ జనార్దన్ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలకు రూ.5వేలు, ఫోర్ వీలర్ వాహనాలకు రూ.20వేలు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని కోరారు. వేలంలో వాహనం దక్కని వారికి వెంటనే డిపాజిట్ తిరిగి చెల్లిస్తామన్నారు.
కేంద్ర బీమా పథకాలను వినియోగించుకోవాలి
పాన్గల్: కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో దర్దీ ఆబా జన భాగీదారి అభియాన్లో భాగంగా ఇన్స్యూరెన్స్, పీఎం జనధన్ ఖాతాలు, సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా తదితర వాటిపై తండా వాసులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవడంతో కుటుంబానికి కలిగే ప్రయోజనాలను వివరించి వారితో ప్రతిజ్ఞ చేయించారు.